logo

స్ప్రే కొడతారు.. సొమ్ము దోచుకుంటారు

బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుని వెళ్లే అమాయకులనే లక్ష్యంగా చేసుకున్న ఓ ముఠా దొంగతనాలకు పాల్పడుతోంది.

Published : 12 May 2023 04:52 IST

వారం రోజుల్లో రూ.10 లక్షల సొత్తు మాయం

పోలీసులు అనుమానిస్తున్న దొంగలు (సీసీ కెమెరాలో నిక్షిప్తమైన ఫొటో)

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుని వెళ్లే అమాయకులనే లక్ష్యంగా చేసుకున్న ఓ ముఠా దొంగతనాలకు పాల్పడుతోంది. గడిచిన వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఈ ముఠా అమాయకుల నుంచి రూ.10 లక్షలకు పైగా ఎత్తుకెళ్లినట్లు సమాచారం. శాలిగౌరారం మండల కేంద్రంలో ఓ మహిళ రూ.1.50 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వెళ్తుండగా గమనించిన దుండగులు ఆమె మెడపై గోకుడు వచ్చే స్ప్రే కొట్టారు. దీంతో ఆమె చేతిలో ఉన్న డబ్బుల సంచి పక్కన బెట్టి తేరుకునేలోపు నగదుతో పరారయ్యారు. మిర్యాలగూడ వన్‌టౌన్‌ పరిధిలోని ఓ బ్యాంకులో మరో వ్యక్తి నుంచి అదే తరహాలో రూ.1.25 లక్షలు ఎత్తుకెళ్లారు. దీంతో పాటు మిర్యాలగూడ టూటౌన్‌, నార్కట్‌పల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ, ప్రాంతాల్లో ఇదే తరహాలో జరిగిన దొంగతనాలు జరిగాయి. వెనుక నుంచి గోకుడు స్ప్రేకొట్టి వారు తేరుకునే లోపు నగదు మాయం చేస్తున్న వారు తమిళనాడు, స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ద్విచక్రవాహనంపై తిరుగుతున్న ముగ్గురు దుండగులు ఎక్కువశాతం బ్యాంకు పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఎక్కువ మొత్తంలో నగదు డ్రా చేసే వారిని గమనించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ దొంగల కోసం నల్గొండతో పాటు ఇతర జిల్లాల పోలీసులు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫొటోల ఆధారంగా పట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు చెపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని