logo

వెంకటాపురం వద్ద రోడ్డు ప్రమాదం

తుర్కపల్లి మండలం వెంకటాపురం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, మోటర్‌ సైకిల్‌ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు.

Published : 07 Jun 2023 03:09 IST

కారు, మోటార్‌ సైకిల్‌ ఢీ.. ఇద్దరు మృతి

భువనగిరి మైసయ్య

తుర్కపల్లి, న్యూస్‌టుడే: తుర్కపల్లి మండలం వెంకటాపురం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, మోటర్‌ సైకిల్‌ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు, మోటార్‌ సైకిల్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజపేట మండలం నెమిలె గ్రామానికి చెందిన భువనగిరి మైసయ్య, ఎర్ర శంకరయ్య తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో మేస్త్రీ పని చేసేందుకు టీవీఎస్‌ ఎక్స్‌ల్‌పై ఉదయం 9.30కు ఇంటి నుంచి బయలు దేరారు. మల్కాజిగిరి మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ (కుషాయిగూడ) ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు బంగారి భానుకుమార్‌, కారుపల్లి రవికుమార్‌, ఏతం ఆంజనేయులు, సుంకుశాల అజయ్‌కుమార్‌ కారులో యాదగిరిగుట్టకు వెళ్తుండగా దత్తాయిపల్లి-వెంకటాపురం గ్రామాల మధ్య ఉదయం 11.15కు మోటారు సైకిల్‌ను ఎదురెదురుగా ఢీకొట్టింది. కారు అతి వేగంగా మోటార్‌ సైకిల్‌ను 15 మీటర్ల దూరం వరకు కారు ఈడ్చుకుంటూ వెళ్లింది. ద్విచక్ర వాహనం పెట్రోల్‌ ట్యాంకు మూత ఊడిపోవటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మోటారు సైకిల్‌పై ఉన్న ఇద్దరికి మంటలు అంటుకున్నాయి. భువనగిరి మైసయ్య (55) డివైడర్‌కు ఢీకొనడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఎర్ర శంకరయ్యకు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం హుటాహుటీనా భువనగిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంకరయ్య (50) సాయంత్రం మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు, మోటారు సైకిల్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. కారులో ఉన్నవారు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మైసయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వాహనాలకు అంటుకున్న మంటలు ఆర్పివేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు.

నెమిలలో విషాదఛాయలు

రాజపేట, న్యూస్‌టుడే: తుర్కపల్లి మండలం వెంకటాపురంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇరువురు రాజపేట మండలం నెమిల గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇందులో భువనగిరి మైసయ్య స్థానిక గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుడు కాగా, ఎర్ర శంకర్‌ కూలీ పని చేస్తుంటాడు. ఒకే రోజు ఇదే గ్రామానికి చెందిన ఇరువురి మరణాలు స్థానికులను కలచివేసింది.

చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందిన ఎర్ర శంకరయ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని