logo

ఇల్లు కూల్చి అమ్మేశారని మహిళ ఆత్మహత్యాయత్నం

కలెక్టరేట్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళ పిల్లలు సహా ఆత్మహత్యాయత్యానికి ఒడిగట్టారు.

Updated : 29 Nov 2022 06:50 IST

కలెక్టరేట్‌ ఎదుట పిల్లలు సహా నిరసన తెలుపుతున్న మస్తాన్‌బీ

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : కలెక్టరేట్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళ పిల్లలు సహా ఆత్మహత్యాయత్యానికి ఒడిగట్టారు. వలస కూలీలుగా వెళ్లి తిరిగి ఇంటికి వస్తే వైకాపా నాయకుడు తమ ఇంటిని కూల్చేసి అమ్మేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని, పురుగుల మందు తాగే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని ఆ మందు డబ్బాను లాగేసుకున్నారు. నెల్లూరు నగరం చాణిక్యపురి కాలనీకి చెందిన మస్తాన్‌బీ, కుటుంబ సభ్యులు షేక్‌ గౌసియా, హసీనా, సయ్యద్‌ రజియా, పిల్లలతో కలిసి సోమవారం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా మస్తాన్‌బీ మాట్లాడుతూ 2005లో తమ అత్త 30 అంకణాల స్థలాన్ని నలుగురు కుటుంబ సభ్యులకు హక్కు కల్పించారన్నారు. ఉపాధి లేక ఇంటికి తాళాలు వేసి పల్నాడు జిల్లా నరసరావుపేటకు వెళ్లి వచ్చి చూడగా ఓ కార్పొరేటర్‌ ఆక్రమించి మరొకరికి విక్రయించాడని ఆరోపించారు. సెప్టెంబరు 9న గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇచ్చానని, తాడేపల్లి ప్రజాదర్బార్‌కు వెళ్లి వినతిపత్రం ఇచ్చినా న్యాయం జరగలేదని వాపోయారు. 50 సార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు. తనకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తానని, తన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ ఆమెకు మద్దతు తెలిపారు. చేజర్ల వెంకటేశ్వరరెడ్డి,  తిరుమలనాయుడు  ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని