logo

అసుర అసుర... జగనాసుర

రామాయణంలో రావణుడొక్కడే. అయిదేళ్ల వైకాపా పాలనలో మాత్రం ఊరూరా అసురులు తయారయ్యారు. సహజ వనరులను ఇష్టారీతిన చెరబట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను అందిన కాడికి మింగేశారు.

Published : 17 Apr 2024 03:47 IST

ఊరూరా వైకాపా అరాచక గణం
అయిదేళ్లలో వ్యవస్థల విధ్వంసం
ఎన్నికల్లో ఓటు బాణం సంధిద్దాం

రామాయణంలో రావణుడొక్కడే. అయిదేళ్ల వైకాపా పాలనలో మాత్రం ఊరూరా అసురులు తయారయ్యారు. సహజ వనరులను ఇష్టారీతిన చెరబట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను అందిన కాడికి మింగేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అరాచక రాజ్యానికి తామే పునాది రాళ్లయ్యారు. అధికారం మాదంటూ అడ్డగోలుగా వ్యవహరించారు. అధినేత అండగా దోపిడీ పర్వాన్ని నిరాటంకంగా సాగించారు. ‘నా ఎస్సీలు...’ అంటూ దళితులపై జగన్‌ ఎక్కడి లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. అదే సమయంలో అతని అనుచరులు ఊళ్లలో వారిపై దాడులు సాగించారు. భూములను యమదర్జాగా కాజేశారు. కొండలు, గుట్టలు, కాలువ గట్లు, జల వనరులు ఇలా వేటినీ విడిచి పెట్టకుండా ఆక్రమించారు. జిల్లాలో ఎటు చూసినా అరాచకం, అవినీతి రాజ్యమేలించారు. తప్పును ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులకు పాల్పడ్డారు. తిరిగి బాధితుల పైనే అక్రమ కేసులు బనాయించి స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పడం పరిపాటిగా మార్చారు. వ్యవస్థలను చెప్పుచేతుల్లో పెట్టుకుని విధ్వంసం చేశారు. బుధవారం శ్రీరామనవమి.. ఈ సందర్భంగా ఓటర్లమైన మనం ప్రతినబూనుదాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు అడుగేద్దాం. మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు అనే రామబాణాన్ని సందిద్ధాం. అరాచక చెర నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. 

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

ఏది మాది..  అంతా వారిది...

జిల్లాలోని తీర ప్రాంతంతో పాటు పలు మండలాల్లో ఇసుకాసురులదే పెత్తనం. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులే భూబకాసరుల అవతారమెత్తారు. నకిలీ పత్రాలతో భూ కుంభకోణాల దగ్గర నుంచి ఉంటున్న ఇళ్లు, సాగు చేసుకుంటున్న పొలాలు, భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేసుకున్న స్థలాలపై రాబందుల్లా వాలిపోతున్నారు. మావి అనుకున్నవేమీ కాకుండా చేస్తున్నారు. చివరికి ఆన్‌లైన్‌లో కూడా పేర్లు మార్చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో పేదలకు చెందిన పలు భూములను ఆక్రమించేందుకు ఓ నాయకుడు చక్రం తిప్పాడు. మార్కాపురం, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లోనూ వందలాది ఎకరాల భూములను వైకాపా అసుర గణం కబంధ హస్తాల్లో బందీ అయ్యాయి.

ఎక్కడుంది ప్రభూ ధర్మం...

రాముడి పేరు చెబితి ప్రజలకు ధర్మమే గుర్తుకొస్తోంది. అందుకే ఇప్పటికీ రామరాజ్యం అనే జపిస్తుంటారు. దురదృష్టం కొద్దీ రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. ఇటీవల ఒంగోలులోని సమతానగర్‌, రిమ్స్‌లో చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. వైకాపా అల్లరి మూకలు రెచ్చిపోయాయి. తెదేపా నాయకులను కొట్టి మళ్లీ వారి పైనే పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసులు పెట్టారు.

  • గత ఏడాది మార్చిలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానూ ఇదే తీరు. ఒంగోలు నగరంలోని సెయింట్‌ థెరెసా ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా అల్లరి మూకలు దాడి చేశాయి. ప్రతిపక్ష నాయకులతో పాటు, తెలుగు మహిళల పైనా దౌర్జన్యానికి దిగారు. కళ్లలో కారం చల్లి భయభ్రాంతులకు గురి చేశారు. తమకు న్యాయం చేయాలని  రెండో పట్టణ పోలీసులను బాధితులు ఆశ్రయిస్తే.. తిరిగి వారి పైనే అక్రమ కేసులు బనాయించారు.

అక్రమార్కుల చేతిలో  జనం బందీ...

ఆనాడు రావణుడి చెరలో సీతమ్మ ఒక్కరే ఉన్నారు. గత అయిదేళ్లుగా జిల్లా వ్యాప్తంగా ఇసుక, గ్రావెల్‌, మైనింగ్‌ మాఫియా చేతుల్లో జనం బందీలుగానే ఉన్నారు. జగనన్న లేఅవుట్ల పేరిట చేపట్టిన భూ సేకరణలో ఎకరా పొలం స్థానికంగా రూ.10 లక్షలుంటే.. రూ.30 లక్షలు చొప్పున కొనుగోలు చేసి కమీషన్లు దండుకున్నారు. ఈ అక్రమాల పర్వం జిల్లా అంతా సాగింది.

భక్షకులుగా మారిన పాలకులు...

నాడు ధర్మం నాలుగు పాదాలపై నడిచింది. ఇప్పుడు ఏ పాదమూ కనిపించడం లేదు. వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. రాజ్యాంగం మేరకు చట్టాలను అమలు చేస్తూ ప్రజలను రక్షించాల్సిన పాలకులే భక్షకులయ్యారు. వార్డు స్థాయి సభ్యులు, కార్పొరేటర్ల నుంచి ఎమ్మెల్యే, మంత్రుల వరకు చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. అందినంత మేస్తున్నారు. దొరికింది దొరికినట్లు దోచుకుంటున్నారు. కష్టాలను అధికారులకు చెప్పుకొందాం అంటే రెవెన్యూ, పోలీసు, పంచాయతీ తదితర వ్యవస్థలన్నీ నామమాత్రంగా మారాయి. అంతటా అధికార పక్ష మనుషులే హల్‌ చల్‌ చేస్తున్నారు. వ్యతిరేకంగా చిన్న ఫిర్యాదు చేసినా జులం ప్రదర్శిస్తున్నారు. తమ బలంతో నిజాయతీ అధికారుల నోరు నొక్కేస్తున్నారు.

దుష్టత్వంపై  పోరాటం...

శ్రీరాముని కల్యాణ ఘడియల సందర్భగా ప్రతిన బూనుతాం. వ్యవస్థల విధ్వంసం నుంచి మమ్మల్ని మేము రక్షించుకునేలా ఓటనే వజ్రాయుధాన్ని సంధిస్తాం. మీ కల్యాణ శుభ సమయంలో ఈ దిశగా వాగ్దానం చేస్తున్నాం. ప్రలోభాలకు లొంగి ఓటును అమ్ముకోం. దుష్ట శక్తులను తరిమి కొడతాం. సమాజ అభివృద్ధికి నీతి నిజాయతీగా పాటుపడే వారినే పాలకులుగా ఎన్నుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని