logo

అయ్యా స్పందించండి!

జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉన్న ఊరిని, ఆస్తిని త్యాగం చేశారు.. పూర్తిగా ఆదుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మారు..

Published : 30 Mar 2023 03:33 IST

ఇళ్ల నిర్మాణం పూర్తయినా అందని బిల్లులు
చెల్లించాలంటూ వంశధార నిర్వాసితుల వేడుకోలు

  ఎల్‌ఎన్‌పేట: శ్యామలాపురం పునరావాస కాలనీ

న్యూస్‌టుడే, ఎల్‌ఎన్‌పేట, పాతపట్నం, హిరమండలం: జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉన్న ఊరిని, ఆస్తిని త్యాగం చేశారు.. పూర్తిగా ఆదుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మారు.. పునరావాస కాలనీకి వచ్చాక పట్టించుకునే వారే కరవయ్యారు. కనీసం ఇళ్ల నిర్మాణాలకూ బిల్లులు ఇవ్వకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మా త్యాగానికి ఇదా ఫలితమంటూ వాపోతున్న వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల గోడు ఇది.

నిర్వాసితుల్లో పేదలకు ప్రభుత్వం 2,467 ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కొక్క ఇంటికి రూ.1.50 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పింది. తీరా ఇళ్ల పనులు ప్రారంభించాక ఒక్క రూపాయి నుంచి రూ.18 వేల వరకు మాత్రమే చెల్లించి ఐదేళ్లుగా బిల్లులు నిలిపేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా బిల్లు మంజూరు చేయలేదని నిర్వాసితులు వాపోతున్నారు. సీఎం జగన్‌, స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్పందించి మంజూరు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.


నాడు రైతులు.. నేడు కూలీలు

నిర్వాసితుల్లో 95 శాతం మంది రిజర్వాయర్‌ నిర్మాణం కాకముందు రైతులుగా ఉండేవారు. ప్రస్తుతం పునరావాస కాలనీలకు చేరడంతో కూలీలుగా మారిపోయారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. వ్యవసాయం, ఇతర మార్గాల నుంచి ఆదాయం లేకపోవడంతో ఇంటి కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలని వీరు ఆందోళన చెందుతున్నారు. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రులు, జిల్లా అధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయిందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లో 12 పునరావాస కాలనీల్లోని పేద నిర్వాసితులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో 1,120 మంది నిర్మాణాలు పూర్తిచేసుకుని అందులోనే నివాసం ఉంటున్నారు. వీటికి అరకొరగా బిల్లులు చెల్లించిన అధికారులు గత శాసనసభ ఎన్నికల తర్వాత ప్రారంభించిన 1,342 మంది ఇళ్లను ఇంతవరకు కనీసం పరిశీలించలేదు, అధికారికంగా నమోదు కూడా చేయలేదు. ప్రస్తుతం వీరు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.


శ్యామలాపురం ఆర్‌ఆర్‌ కాలనీలో శివాలయం  అర్చకులుగా ఉన్న రుద్రసంటి   సోమయ్యకు ఒక్క రూపాయి ఇంటి బిల్లు రావడంతో పనులు ప్రారంభించాలని అధికారులు చెప్పారు. లెంటల్‌ ఎత్తు వరకు నిర్మాణం చేపట్టాం. కానీ బిల్లు మంజూరు కాలేదు. దీంతో ఆలయం పక్కనే పురిపాకలో ఉంటున్నారు. గతేడాది తుపానుకు రేకులు ఎగిరిపోయాయి. గ్రామస్థులు చందాలు పోగు చేసి మళ్లీ రేకులు వేశారు.


పెద్దకోట  పుష్పలత తాయిమాంబపురం పునరావాస కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈమెకు ఇల్లు మంజూరు కావడంతో అధికారులు నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు తొలుత ఒక్క రూపాయి మాత్రమే బిల్లు మంజూరు చేశారు. రూ.2 లక్షలు ఖర్చు చేసి పైకప్పు వరకు వేశారు. ఇంక స్థోమతలేక అసంపూర్తిగా ఉన్న ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. బిల్లు మంజూరు చేస్తే ప్లాస్టింగులు, గచ్చులు వేసుకోవాలని ఎదురుచూస్తున్నారు.


ప్రతిపాదనలు పంపాం: 2018లో పేద నిర్వాసితులకు ఇళ్లు మంజూరు చేశాం. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన వారికి 2019లో కొంత మేర బిల్లులు మంజూరు చేశాం. మిగిలిన బిల్లుల సొమ్ము ఇంకా రాలేదు. వస్తే ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాం

నర్సింగరావు, డీఈఈ, గృహ నిర్మాణశాఖ, పాతపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని