logo

వైద్య పట్టభద్రుల్లో ప్రథములు

నీట్‌లో ఉత్తమ ర్యాంకుల సాధన.. ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలలో ప్రవేశం.. చేరిన వారందరూ ప్రతిభావంతులే.. కాని తుది ఫలితాల్లో ఇద్దరు మాత్రం అత్యుత్తుమ ప్రతిభావంతులుగా నిలిచి అవార్డులు కైవసం చేసుకున్నారు.

Published : 28 Mar 2023 04:18 IST

2017 బ్యాచ్‌లో సైమా, ప్రియాంక ఉత్తమ ప్రతిభ
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే

ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బుచ్చిరాజు నుంచి బంగారు పతకం స్వీకరిస్తున్న డాక్టర్‌ సైమా మదీనియా

నీట్‌లో ఉత్తమ ర్యాంకుల సాధన.. ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలలో ప్రవేశం.. చేరిన వారందరూ ప్రతిభావంతులే.. కాని తుది ఫలితాల్లో ఇద్దరు మాత్రం అత్యుత్తుమ ప్రతిభావంతులుగా నిలిచి అవార్డులు కైవసం చేసుకున్నారు. తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారు. ఆంధ్ర వైద్య కళాశాల 2017 బ్యాచ్‌లో మొత్తం 200 మంది ఎం.బి.బి.ఎస్‌ కోర్సు చదివారు. వారిలో డాక్టర్‌ సైమా మదీనియా ఐదేళ్ల కోర్సులో అత్యధిక మార్కులు సాధించి అండర్సన్‌ అవార్డు కైవసం చేసుకున్నారు. ఆఖరి ఏడాది పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందిన డాక్టర్‌ వైష్ణవి ప్రియాంక సిల్వర్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ కమిటీ అవార్డు సాధించారు. నగరంలో జరిగిన ఆంధ్ర వైద్యకళాశాల పట్టభద్రుల దినోత్సవంలో ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు వీరికి ఆయా అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు విద్యార్థినులను అభినందించారు.


ఆ రోజులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి..

మా స్వస్థలం కృష్ణా జిల్లా పెడన. నాన్న సయీద్‌ అహ్మద్‌, అమ్మ జుబేదా బేగమ్‌. నాన్న అరబిక్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మా కుటుంబంలో నా ముందు ఎవరూ వైద్యులుగా పని చేయలేదు. ఎలాగైనా డాక్టర్‌ అవ్వాలనే పట్టుదలతో చదివి నీట్‌లో 520వ ర్యాంకు సాధించా. ఆంధ్ర వైద్యకళాశాలలో ఎం.బి.బి.ఎస్‌. సీటు వచ్చింది. కళాశాలలో చేరిన తొలిరోజు ఆందోళన, ఉద్వేగంతో గడిపా. ఇప్పటికీ అది గుర్తు ఉంది. ప్రతిష్ఠాత్మక కళాశాల నుంచి అత్యుత్తమ ఫలితాలతో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశా. ఇక్కడ చదువుకున్న రోజులు ఎప్పుడూ గుర్తుంటాయి. భవిష్యత్తులో మెడిసిన్‌/పీడియాట్రిక్‌ కోర్సులో పీజీ చేసి వైద్యురాలిగా స్థిరపడతా. రోగులకు నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తా. మొత్తం అయిదేళ్లకు కలిపి 2450 మార్కులకుగాను 1943 మార్కులు సాధించి 2017 బ్యాచ్‌లో అగ్రస్థానంలో నిలిచా.

డాక్టర్‌ సైమా మదీనియా


నాన్న స్ఫూర్తితో అడుగులు..

ఆంధ్ర వైద్యకళాశాలలో సీటు రావడం గర్వకారణంగా భావించా. ఐదేళ్లు కష్టపడి చదివా. చివరి ఏడాది పరీక్షల్లో 900 మార్కులకు గాను 728 మార్కులు వచ్చి అగ్రస్థానంలో నిలిచా. నీట్‌లో 500వ ర్యాంకు వచ్చింది. మాది శ్రీకాకుళం జిల్లా పలాస. నాన్న డాక్టర్‌ జీవితేశ్వరరావు. 40ఏళ్ల క్రితం ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివారు. నాన్న స్ఫూర్తితో నేను ఇక్కడే చదువుకొని అత్యధిక మార్కులు సాధించా. భవిష్యత్తులో అమెరికా వెళ్లి మెడిసిన్‌లో పట్టా తీసుకోవాలనే ధ్యేయంతో ఉన్నా. అక్కడ ఉన్నత చదవులు పూర్తి చేసిన తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చి ఆసుపత్రి ఏర్పాటు చేస్తా. తక్కువ ఖర్చుతో కూడిన మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందిస్తా. నాకు సహకరించిన కుటుంబసభ్యులు, ప్రొఫెసర్లకు రుణపడి ఉంటా.

డాక్టర్‌ వైష్ణవి ప్రియాంక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని