logo

అనుమానం పెనుభూతమై..

కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది.

Published : 27 Apr 2024 04:04 IST

భార్యను కడతేర్చిన భర్త

పూర్ణ (పాత చిత్రం)

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అనుమానం పెనుభూతమై భార్యను కడతేర్చాడా భర్త. ఈ హృదయ విదారక ఘటన బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెంలో గురువారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాల సత్తిబాబు, పూర్ణ దంపతులు. వీరికి పదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. భార్య నడతపై అనుమానం పెంచుకున్న సత్తిబాబు తరచూ ఆమెను వేధిస్తుండేవాడు. పెద్దలు పంచాయితీ చేయడంతో కొద్ది నెలలుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇంటికి సమీపంలోని తోటల్లో గురువారం రాత్రి మరో వ్యక్తితో పూర్ణ ఉండటం చూసిన సత్తిబాబు ఆగ్రహంతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అనంతరం అక్కడి నుంచి గ్రామంలోకి వచ్చిన సత్తిబాబు తన భార్యను ఎవరో కొట్టి చంపేస్తున్నారంటూ కేకలు వేస్తూ స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో వారు గ్రామానికి చేరుకుని సత్తిబాబును అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి అన్నయ్య రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సత్తిబాబును రిమాండుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని