logo

ధాన్యం అమ్మకానికి వెళ్లి... అనంతలోకాలకు...

కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మడానికి వెళ్లిన రైతు, కాంటాలు ఆలస్యమైతుందని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదానికి గురై అనంతలోకాలకు వెళ్లిన విషాద ఘటన హనుమకొండ జిల్లా దామెర పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది.

Updated : 29 May 2023 05:02 IST

చంద్రు (పాతచిత్రం)

దామెర, న్యూస్‌టుడే: కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మడానికి వెళ్లిన రైతు, కాంటాలు ఆలస్యమైతుందని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదానికి గురై అనంతలోకాలకు వెళ్లిన విషాద ఘటన హనుమకొండ జిల్లా దామెర పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది.ఎస్సై ముత్యం రాజేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... నడికూడ మండలం కంఠాత్మకూరుకు చెందిన పేరబోయిన చంద్రు (48), తన ఎకరాన్నర భూమిలో వరి పండించారు. శనివారం ధాన్యం అమ్మడానికి దామెర మండలం దుర్గంపేట రైస్‌మిల్లుకు వచ్చారు. ఈ రోజు తూకం కాదని మిల్లు నిర్వాహకులు చెప్పడంతో రామక్రిష్ణాపూర్‌కు చెందిన ట్రాక్టర్‌లో ఇంటికి బయలుదేరారు. ఊరుగొండ శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. చంద్రుతో పాటు డ్రైవర్‌ కిందపడగా, చంద్రుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
వాహనాలు సమకూర్చరా...: కంఠాత్మకూరు, రామక్రిష్ణాపూర్‌, తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపునకు అధికారులు లారీలు సమకూర్చడం లేదు. దీంతో రైతులే స్వయంగా ట్రాక్టర్లను అద్దెకు తీసుకొని ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారు. అధికారులు స్పందించి లారీలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.


రైతుల రాస్తారోకో

నడికూడ, న్యూస్‌టుడే: ధాన్యాన్ని మిల్లులకు తరలించకుండా నిర్లక్ష్యం చేస్తుండటాన్ని నిరసిస్తూ ఆదివారం కంఠాత్మకూర్‌ రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించగా నిర్వాహకులు లారీలు లేవని చెప్పడంతో రైతు చంద్రయ్య స్వయంగా తన ధాన్యాన్ని మిల్ల్లుకు తరలించి, తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఆరోపిస్తూ స్థానిక రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేపట్టి, ప్రధాన రోడ్డ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని