logo

అరకొర వైద్యం.. అందని మందులు

జిల్లా కేంద్రం ఏలూరులోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీ సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతోంది. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవటంతోపాటు పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు.

Updated : 09 Jun 2023 06:36 IST

సమస్యల సుడిలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ
‌వెంటాడుతున్న సిబ్బంది కొరత
ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే

డిస్పెన్సరీలో వైద్యసేవలందిస్తున్న వైద్యుడు

జిల్లా కేంద్రం ఏలూరులోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీ సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతోంది. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవటంతోపాటు పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. దీని పరిధిలో వేలాదిమంది కార్మికులు ఉండటంతో ఇక్కడ ఆసుపత్రి నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నా ఇంత వరకు అమలు కాలేదు. డిస్పెన్సరీలోనైనా పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకపోవటంతో కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఈఎస్‌ఐకు జిల్లా నుంచి ఏటా కోట్లాది రూపాయల నిధులు సమకూర్చినా కార్మికులకు ఆ మేరకు వైద్యసేవలు అందడం లేదు. ఏలూరు డిస్పెన్షరీలో రోజుకు 150 నుంచి 200 మంది ఓపీ సేవలు పొందుతుంటారు. జ్వరం, దగ్గు, తలనొప్పి, గ్యాస్‌ ట్రబుల్‌, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు ఇలా చిన్నచిన్న అనారోగ్యాలకు మాత్రమే ఇక్కడ సేవలందిస్తున్నారు. మిగిలిన వాటికి విజయవాడ రిఫర్‌ చేస్తున్నారు.

దీర్ఘకాలిక  రోగాలకు ఔషధాలేవీ

దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారికి వైద్యం, మందులు అందుబాటులో లేవు. బయట మందులు కొనుగోలు చేయాల్సి రావడంతో నెలకు రూ.2 వేల నుంచి 3 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. క్యాన్సర్‌, గుండె, మూత్రపిండాలు, కాలేయం,  వెన్నుముక సంబంధ సమస్యలు, స్పాండిలైటిస్‌ వంటి రోగాలకు ఇక్కడ ఔషధాలు ఉండవు. దీంతో పాటు కొంతకాలంగా రక్తపోటు, మధుమేహానికి కూడా ఇవ్వడంలేదని రోగులు వాపోతున్నారు.

నలుగురికి ఒక్కరే

నలుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరే సేవలందిసున్నారు. పీజీ చదివేందుకు ఇద్దరు, డిప్యుటేషన్‌పై మరొకరు వెళ్లిపోవటంతో ఆ మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వైద్యులతో కలిపి మొత్తం 22 పోస్టులున్నాయి. వాటిలో స్టాఫ్‌ నర్సు పోస్టులు రెండూ ఖాళీగా ఉండటం గమనార్హం. ఫార్మాసిస్టులు ముగ్గురికి ఇద్దరే ఉన్నారు. ల్యాబ్‌టెక్నీషియన్‌, ఏఎన్‌ఎం, ఎఫ్‌ఎన్‌ఎం, సీనియర్‌ అసిస్టెంట్‌ ముగ్గురు ఉన్నారు. ఇక జూనియర్‌ అసిస్టెంట్లు ఇద్దరికి ఒక్కరే ఉన్నారు. అటెండర్లు ఇద్దరికి ఒక్కరు, రెండు తోటీ పోస్టుల్లో ఒక్కరే ఉన్నారు.

భర్తీకి చర్యలు

‘డిస్పెన్సరీల్లో వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాం. స్టాఫ్‌ నర్సులను ఇప్పటికే తీసుకున్నాం. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఈఎస్‌ఐ ఆస్పత్రుల జేడీ జి.జగదీప్‌ గాంధీ తెలిపారు.

బీపీకీ కూడా లేవన్నారు

జూట్‌మిల్లు విశ్రాంతి ఉద్యోగిని. ఏలూరు డిస్పెన్సరీలో కొంతకాలంగా బీపీ మందులు ఇవ్వడం లేదు. స్టాకు రాలేదని చెబుతున్నారు. దీంతో బయట కొనుక్కుంటున్నాను. రూ.1000 ఖర్చవుతోంది. వృద్ధాప్యం మీద పడటంతో ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. మందులు అందుబాటులో ఉంచితే మాలాంటి వారికి కొంత ఉపశమనం కలుగుతుంది.

జి.మాణిక్యమ్మ, ఏలూరు.

రూ.2 వేలవుతోంది

స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నా.   ఇక్కడి డిస్పెన్సరీలో వైద్యం లేదంటే విజయవాడ వెళ్లా. ప్రైవేటు ఆసుపత్రిలోనూ చికిత్స చేయించుకున్నా. ఇక్కడ మందులు లేకపోవడంతో నెలనెలా రూ.2 వేలు పైనే ఖర్చవుతోంది.

ఎం.జయకృష్ణ, కొత్తూరు జూట్‌మిల్లు వర్కరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని