logo

హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష

హత్య కేసులో నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ మదనపల్లె రెండో అదనపు జిల్లా జడ్జి భాస్కర్‌రావు గురువారం తీర్పు చెప్పినట్లు చిత్తూరు జిల్లా పుంగనూరు సీఐ గంగిరెడ్డి తెలిపారు.

Published : 03 Feb 2023 00:50 IST

జీవితఖైదు పడిన నారాయణను జైలుకు తరలిస్తున్న కానిస్టేబుల్‌

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : హత్య కేసులో నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ మదనపల్లె రెండో అదనపు జిల్లా జడ్జి భాస్కర్‌రావు గురువారం తీర్పు చెప్పినట్లు చిత్తూరు జిల్లా పుంగనూరు సీఐ గంగిరెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు... పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ మొరంపల్లెకు చెందిన కలగటూరి నారాయణ (62) వ్యవసాయం చేస్తాడు. ఇతను ఇదే గ్రామానికి చెందిన పార్వతమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే సమయంలో పార్వతమ్మ ఆస్తిని ఆమ్మి డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బు తనకు ఇవ్వాలని పార్వతమ్మ పట్టుబట్టడంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో 2015 డిసెంబరు 6వ తేదీన పార్వతమ్మ గొడవకు దిగడంతో ఆగ్రహంతో నారాయణ సుత్తితో పార్వతమ్మ తలపై కొట్టి హత్య చేశారు. ఈ కేసులో నిందితుడైన నారాయణను అప్పటి పుంగనూరు సీఐ చంద్రశేఖర్‌ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువు కావడంతో నారాయణకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే మరో మూడు నెలలు అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. కేసులు శిక్ష పడిన ఖైదీని సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో ఏపీపీగా జనార్దన్‌ వ్యవహరించారని సీఐ తెలిపారు.


కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

మృతి చెందిన శంకర్‌రెడ్డి

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లె పట్టణంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు... కురబలకోట మండలం పెద్దపల్లెకు చెందిన రెడ్డెప్పరెడ్డి కుమారుడు సి.శంకర్‌రెడ్డి (38)కి 2008లో కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన లక్ష్మీదేవితో వివాహమైంది. ఇతను చింతామణిలోని ఓ హార్డ్‌వేర్‌ దుకాణంలో పనిచేస్తాడు. వీరికి చరణ్‌కుమార్‌రెడ్డి, జయశ్రీ పిల్లలు. వారం రోజుల క్రితం శంకర్‌రెడ్డి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో మదనపల్లెలోని చంద్రాకాలనీలో ఉన్న తండ్రి వద్దకు వచ్చాడు. కుటుంబ విషయమై భార్య లక్ష్మీదేవితో అతను గొడవపడ్డాడు. ఇంట్లోని వారంతా గురువారం ఉదయం రెడ్డెప్పరెడ్డిని విరూపాక్ష పురానికి తీసుకెళ్లారు. ఇంట్లో ఒక్కడే ఉన్న అతను ఇంటికి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంట్లో శంకర్‌రెడ్డి లేకపోవడంతో వెతికారు. దీంతో శంకర్‌రెడ్డి ఇంటి పక్కనే ఉన్న చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రి మార్చురికి తరలించారు.


వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

నాగార్జున (పాతచిత్రం)

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం పీలేరు మండలంలో చోటు చేసుకుంది. చిత్తూరు వైపు నుంచి కలకడకు వెళుతున్న టాటా ఏస్‌ టెంపో వాహనం పీలేరు సమీపంలోని రిలయన్స్‌ పెట్రోలు బంకు వద్ద విద్యుత్తు స్తంభాల లోడుతో ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో పాకాల మండలం పది పట్ల బైలు పంచాయతీ పుల్లావారిపల్లెకు చెందిన నాగార్జున (32) తలకు తీవ్రంగా గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌.ఐ. నరసింహుడు పొక్లెయిన్‌ సాయంతో టెంపోలో ఇరుకున్న మృతదేహాన్ని వెలికి తీయించారు. మరణోత్తర పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. వివరించారు. మృతుడు డ్రైవరుగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఇతనికి భార్య గంగాభవాణి, కుమారుడు జగదీష్‌ ఉన్నారు.

రేణిగుంట : గుర్తు తెలియని వాహనం ఢికొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు... రైల్వే కోడూరు మండలం రామరాజుపల్లెకు చెందిన రాజేంద్ర(40) గురువారం రాత్రి శ్రీనివాసపురం వద్ద రోడ్డు దాటుతుండగా కడప వైపు నుంచి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో రాజేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


అనారోగ్యంతో శిశువు మృతి...

తిరుపతి (వైద్యం) : పుట్టిన 24 గంటల్లోగా చికిత్స నిమిత్తం రుయా చిన్న పిల్లల ఆస్పత్రికి శిశువును తీసుకొచ్చారు.. నెలల తక్కువగా పుట్టడం.. తగిన బరువు లేని కారణంగా చికిత్స పొందుతూ చనిపోగా.. వదిలి వెళ్లారు. రుయా చిన్న పిల్లల ఆస్పత్రి విభాగాధిపతి డాక్టర్‌ కిరీటి తెలిపిన వివరాల మేరకు... పీలేరు ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి గత నెల 30వ తేదీ తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవించింది. తక్కువ బరువు.. నెలలు నిండక అనారోగ్యంగా ఉన్న బిడ్డను అవ్వ, తాతలు రుయా చిన్న పిల్లల ఆస్పత్రికి 31వ తేదీ తీసుకొచ్చారు. మరుసటి రోజు పింఛను తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బందికి చెప్పి వెళ్లిపోయారు. కేస్‌ షీట్‌లో తండ్రిగా నమోదైన వ్యక్తి చరవాణి నంబరుకు ఫోన్‌ చేయగా నాకు సంబంధం లేదని చెప్పారు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయడంతో ఆస్పత్రి వర్గాలు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని