L V Subrahmanyam: రాజకీయ పార్టీకి కొమ్ముకాసే అధికారులు చింతించే రోజులొస్తాయ్‌: సీఎఫ్‌డీ

ప్రవర్తనా లోపాలతో మచ్చలేని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అభాసుపాలు చేయొద్దని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) సంస్థ ఉపాధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.

Updated : 06 Apr 2024 17:51 IST

విజయవాడ: నిష్పక్షపాత వైఖరి కోల్పోయి.. ఒక రాజకీయ పార్టీకి అండగా పనిచేస్తున్న అధికారులు చింతించే రోజు తప్పకుండా వస్తుందని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) సంస్థ ఉపాధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రవర్తనా లోపాలతో మచ్చలేని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అభాసుపాలు చేయొద్దని హితవు పలికారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించి, ఆదరించి, ఆచరించి, పోటీ చేసిన అభ్యర్థులందరికీ నమ్మకాన్ని కలిగించాల్సిన తరుణమొచ్చిందని సీఎఫ్‌డీ ప్రతినిధులు పేర్కొన్నారు. తాము ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకున్నవాళ్లం కాదంటూ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. జిల్లా కలెక్టరు నుంచి సీఎస్‌ వరకు, ఎస్పీ నుంచి డీజీపీ వరకు నిష్పక్షపాత వైఖరి చూపించాలని పిలుపునిచ్చారు. ఈసీ ఆదేశాలు విఫలమయ్యేలా చేయడంలో కీలకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నిధులున్నప్పటికీ ఆలస్యం: నిమ్మగడ్డ

పింఛన్ల పంపిణీలో ఆలస్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సీఎఫ్‌డీ ఫిర్యాదు చేసింది. 62 లక్షల మందిని కొందరు ఇబ్బంది పెడుతున్నారని సంస్థ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌ అన్నారు. కొందరు కావాలనే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేశారని ఆరోపించారు.  నిధులు ఉన్నప్పటికీ జాప్యం చేశారని,  మే నెలలో ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సీఈవోను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని