Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 01 Dec 2022 21:33 IST

1. మునుగోడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం: మంత్రి కేటీఆర్‌

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు.. పోలవరం వద్ద ఉద్రిక్తత

పోలవరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శనకు పోలీసుల అనుమతి నిరాకరించారు. దీంతో పోలవరం డ్యాం సైట్‌కు వెళ్లే మార్గంలో రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. తనతో పాటు, మరో ఐదుగురు నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసుల్ని ఆయన కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఐటీ కలకలం.. ఏపీ మంత్రి జయరామ్‌కు నోటీసులు

కర్నూలు: ఏపీలో ఐటీశాఖ నోటీసులు కలకలం రేపాయి. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, ఆయన భార్య రేణుకమ్మతో పాటు, ఆలూరు సబ్‌ రిజిస్ట్రార్‌కు  ఐటీశాఖ నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేణుకమ్మ పేరుతో ఆస్పరి మండలం చిన్నహోతురు, ఆస్పరిలో 30.83 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత టీ20 లీగ్‌ సహచరులే.. విజయ్ హజారే ట్రోఫీలోనూ అదరగొట్టేశారు

విజయ్‌ హజారే ట్రోఫీ కోసం దేశీయంగా 32 జట్లు తలపడ్డాయి. చివరికి డిసెంబర్‌ 2న మహారాష్ట్ర, సౌరాష్ట్ర మాత్రమే ఫైనల్‌లో ఢీకొనబోతున్నాయి. అయితే టోర్నీలో ఇద్దరు పేర్లు మారుమోగిపోతున్నాయి. ఒకరేమో శతకాల నారాయణ్ జగదీశన్‌ కాగా.. మరొకరు సిక్సర్ల రుతురాజ్‌ గైక్వాడ్‌. విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో రెండకెల వృద్ధి.. విద్యుత్‌ వినియోగంలోనూ తగ్గేదేలే!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల జోరు కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో వీటి విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. పండగలు, వ్యవసాయ రంగం నుంచి ఉన్న డిమాండే దీనికి కారణమని పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నవంబర్‌లో పెట్రోల్‌ విక్రయాలు 11.7 శాతం పెరిగి 2.66 మిలియన్‌ టన్నులకు చేరింది. గతేడాది ఇదే సమయంలో విక్రయాలు 2.38 మిలియన్‌ టన్నులుగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Video: ‘జిన్నా’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

6. దొంగ...పోలీస్‌..పరుగో పరుగు..వీడియో వైరల్‌!

ఓ కారులో నేరస్థులు రయ్‌ మంటూ దూసుకొచ్చారు.. వారికి ఎదురుగా పోలీసులు మరో వాహనంలో సర్‌ర్‌ మంటూ వచ్చారు. రెండు వాహనాలు దాదాపు మీటరు దూరంలో ఆగాయి. అంతే.. నేరస్తులు కారు డోరు తీసి పరుగు తీశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు కూడా కాళ్లకి పని చెప్పారు. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించే ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.రూ.కోటి విలువైన నగలను క్యాబ్‌లో మర్చిపోతే..!

కుమార్తె వివాహం కోసం యూకే నుంచి నోయిడా వచ్చిన ఓ ఎన్నారై దాదాపు రూ. 1 కోటి విలువ చేసే నగలను ఉబర్‌ క్యాబ్‌లో మర్చిపోయారు. అయితే, నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు నగలను స్వాధీనం చేసుకొని అతడికి అందజేశారు. ఈ ఘటన గ్రేటర్‌ నోయిడాలో జరిగింది. నోయిడా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 50 కి.మీలు.. 16 నియోజకవర్గాలు.. మోదీ మెగా రోడ్‌ షో

గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Election2022)ల్లో గెలుపే లక్ష్యంగా భాజపా(BJP) వినూత్న ప్రచార వ్యూహంతో దూసుకెళ్తోంది. నేటితో తొలి విడత పోలింగ్‌ పూర్తి కావడంతో.. మలి విడత ఎన్నికలపై పూర్తిస్థాయి ఫోకస్‌ను పెట్టింది. హిందుత్వ ప్రయోగశాలగా పేర్కొనే గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇమేజ్‌పైనే భారీ ఆశలు పెట్టుకున్న కమలదళం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మదన్‌లాల్‌, ఆర్పీ సింగ్‌ ఔట్‌.. క్రికెట్‌ అడ్వైజరీ కమిటీలోకి మల్హోత్రా, పరంజపే

 క్రికెట్‌ జట్టు సెలెక్షన్ కమిటీ ఎంపిక కోసం భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కీలక చర్యలు తీసుకొంది. ముందుగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో భారీ మార్పులు చేపట్టింది. ఇంతకుముందు ఉన్న మదన్‌లాల్‌, రుద్రప్రతాప్‌ సింగ్ (ఆర్పీ సింగ్‌) స్థానాల్లో అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరంజపేలను బీసీసీఐ తీసుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లీటరుపై ₹10లకు పైనే తగ్గించే అవకాశం ఉన్నా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించట్లేదు: కాంగ్రెస్‌

దేశంలో అధిక పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొనసాగుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా భాజపా దోపిడీ మాత్రం కొనసాగుతోందని ధ్వజమెత్తింది. లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రూ.10లకు పైగా తగ్గించే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా తగ్గించట్లేదని కాంగ్రెస్‌ అగ్రనేతలు విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని