Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 24 Jun 2022 16:58 IST

1. ‘అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోనసీమ జిల్లాను ‘అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాగా పేరు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

నామినేషన్ వేసిన ద్రౌపదీ ముర్మూ.. వెంటే ఉన్న ప్రధాని, కేంద్రమంత్రులు

2. ఇంటర్మీడియట్‌లో మళ్లీ పూర్తి స్థాయి సిలబస్‌

ఇంటర్మీడియట్‌లో ఈ విద్యాసంవత్సరం నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్‌ అమలు కానుంది. రెండేళ్లుగా కరోనా వల్ల తరగతులు సరిగా నిర్వహించలేకపోవడంతో  30శాతం సిలబస్‌ను తొలగించారు. దానికి అనుగుణంగానే ఎంసెట్‌లోనూ 70శాతం సిలబస్‌ నుంచే పరీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు కుదుట పడటతో పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్టు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

3. ఎవరి అండతో ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారు?: చంద్రబాబు

పోలీసుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు వచ్చిన చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత కాళ్ల పైనుంచి పోలీసు జీపు వెళ్లడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఎవరి అండ చూసుకుని పోలీసులు ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. 

రణ్‌బీర్‌కపూర్‌ ‘షంషేరా’ ట్రైలర్‌

4. మహా సంక్షోభం వెనుక భాజపా హస్తం.. ఆ పార్టీ చీఫ్‌ ఏమన్నారంటే?

ఏక్‌నాథ్‌ శిందే సహా పలువురు శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక భాజపా హస్తం ఉందంటూ వస్తోన్న ఆరోపణలను ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ తోసిపుచ్చారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో తమ పార్టీ పాత్రేమీ లేదని తెలిపారు. అయితే, వేరే పని నిమిత్తం ఇటీవల తమ నేత, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడణవీస్‌ దిల్లీకి వెళ్లినట్లు ధ్రువీకరించారు. 

5. ఓయోలో రూమ్స్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్‌.. కేవలం వారికి మాత్రమే!

ఆతిథ్య సేవలు అందించే ఓయో సంస్థ (OYO Rooms) కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. తమ హోటళ్లలో చిరు వ్యాపారులకు 60 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 27న ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్న, మధ్యతరగతి వ్యాపారుల కోసం ఈ పరిమిత కాలపు స్కీమ్‌ తీసుకొచ్చినట్లు ఓయో ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 27 నుంచి జులై 3 వరకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది.

6. సాయి డిఫెన్స్‌ అకాడమీకి రైల్వే పోలీసుల నోటీసులు

సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆర్మీ ఉద్యోగార్థులను రెచ్చగొట్టారనే ఆరోపణల నేపథ్యంలో రైల్వే యాక్ట్‌ 1989 కింద నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. నోటీసులను కార్యాలయం గేటుకు అతికించారు. విచారణకు వచ్చే సమయంలో సాయి డిఫెన్స్‌ అకాడమీకి చెందిన రికార్డులు, ఆధారాల పత్రాలతో రావాలని సూచించారు. 

7. ఫిల్మ్‌ ఫెడరేషన్‌తో చర్చలు.. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం: దిల్‌రాజు

ఫిల్మ్‌ ఫెడరేషన్‌తో చర్చలు ప్రారంభించామని, సంబంధిత వివరాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలిపారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, ఫిల్మ్‌ ఫెడరేషన్‌లతో జరిగిన భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ వారితో ఏ రోజు ఏం మాట్లాడుకున్నామో వాటన్నింటినీ క్రోడీకరించి, చివరి రోజు మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తామని వెల్లడించారు. 

8. భారత్‌లో.. 42లక్షల మరణాలను నివారించిన వ్యాక్సిన్లు

కరోనా వైరస్ మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అంతేకాకుండా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వాస్తవ ఫలితాల్లోనూ తేలడం ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో ఒక్క ఏడాదిలోనే (2021 వరకు) 42 లక్షల మరణాలను వ్యాక్సిన్లు నివారించినట్లు (Prevent) తాజా అధ్యయనం పేర్కొంది.

9. వారికి లేని పెన్షన్ నాకెందుకు..?: కేంద్రాన్ని ప్రశ్నించిన వరుణ్ గాంధీ

‘అగ్నివీరులు స్వల్పకాలం దేశానికి సేవ చేస్తారు. వారికి పెన్షన్ పొందే హక్కు లేదు. ప్రజా ప్రతినిధులకు మాత్రం ఈ సదుపాయం ఎందుకు కల్పిస్తున్నారు..? దేశాన్ని రక్షించే వారు పెన్షన్ పొందడానికి అర్హులు కాకపోతే.. నేను కూడా దానిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మీరు ఏమంటారు?’ అంటూ భాజపా ఎంపీ వరుణ్ గాంధీ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. 

10. వాయుసేన అగ్నిపథ్‌ రిజిస్ట్రేషన్లు మొదలు..!

వాయుసేనలో అగ్నిపథ్‌ కింద నియామకాల కోసం రిజిస్ట్రేషన్లు నేటి నుంచి మొదలయ్యాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5వ తేదీన ముగుస్తుంది. అగ్నిపథ్‌కు అవసరమైన నిబంధనలు అభ్యర్థులు పాటించాలి. అభ్యర్థులు దరఖాస్తు, జతచేసిన స్కాన్‌ కాపీలను తమ వద్ద ఉంచుకోవాలని అధికారులు సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని