మోదీని సాయం అడిగిన గొంతు మూగబోయింది..!

‘‘నిన్ను మా సోదరుడిగా భావించి సాయం అడుగుతున్నాం. మా ప్రాంతంలో జరుగుతున్న నరమేధం, యుద్ధనేరాలపై అంతర్జాతీయ వేదికలపై బలోచ్‌ చెల్లెళ్ల గొంతుకగా మారు. మేము ఈ పోరాటాన్ని సొంతగానే  కొనసాగిస్తాము

Updated : 22 Dec 2020 17:15 IST

 కెనడాలో కరీమా బలోచ్‌ హత్య

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘నిన్ను మా సోదరుడిగా భావించి సాయం అడుగుతున్నాం. మా ప్రాంతంలో జరుగుతున్న నరమేధం, యుద్ధనేరాలపై అంతర్జాతీయ వేదికలపై బలోచ్‌ చెల్లెళ్ల గొంతుకగా మీరు మారాలి. మేము ఈ పోరాటాన్ని సొంతంగానే  కొనసాగిస్తాము. నువ్వు  కేవలం మా ఆవేదనను ప్రపంచానికి తెలియజెయ్యి’’ అంటూ 2016లో రక్షా బంధన్‌ రోజున భారత ప్రధాని నరేంద్రమోదీకి ఓ సందేశం వచ్చింది. ఈ సందేశాన్ని నాటి ‘బలోచ్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌’ ఛైర్‌పర్సన్‌ కరీమా బలోచ్‌ రికార్డ్‌ చేసి తారేక్‌ ఫతా అనే కెనడా రచయిత యూట్యూబ్‌ ఛానల్‌లో పెట్టారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. అప్పుడు మోదీని సోదరుడితో పోల్చిన ఆ గొంతు నేడు మూగబోయింది. పాక్‌ ఉక్కుపిడికిలిలోని బలోచిస్థాన్‌ నుంచి 2016 తప్పించుకొని కెనడాలో శరణార్థిగా జీవిస్తున్న ఆమెను కొందరు వేటాడి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నేడు టొరెంటో నగరానికి సమీపంలో కనుగొన్నారు. ఆమె మృతితో 40 రోజులు సంతాప దినాలు పాటించాలని బలోచ్‌ నేషనల్‌ మూవ్‌మెంట్‌ పిలుపునిచ్చింది. ఈ హత్య వెనుక పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కెనడాలో స్థిరపడిన పాక్‌ జనరల్స్‌ను కరీమా తీవ్రంగా విమర్శించారు. 2016లో బీబీసీ ప్రచురించిన 100మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో కరీమా కూడా స్థానం దక్కించుకొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016లో స్వాతంత్ర దినోత్సవం రోజున బలోచ్‌ అంశాన్ని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇది జరిగిన వారం తర్వాత కరీమా సందేశం వచ్చింది. 

ఆమె చివరి ట్వీట్‌ కూడా ఉద్యమం గురించే..

డిసెంబర్‌ 14న కరీమా తన ట్విటర్‌ హ్యాండిల్‌లో చివరి సారి ట్వీట్‌ చేశారు. బలోచ్‌ ఉద్యమకారులను రక్షించాలని ఆమె కోరారు. పాక్‌ సైన్యం తమ వారిని కిడ్నాప్‌, హత్యలు చేస్తోందని పేర్కొంది. బలోచ్‌ ఉద్యమకారులు హత్యలకు గురికావడం ఇదే తొలిసారి కాదు. మేలో బలోచ్‌ జర్నలిస్టు సాజిద్‌ హుస్సేన్‌ను స్వీడన్‌లో పాక్‌ కిరాయి మూకలు హత్య చేశాయి.   

బలోచిస్థాన్‌లో పరమక్రూరంగా పాక్‌..!

బలోచిస్థాన్‌ను బలవంతంగా గుప్పిట పెట్టుకొన్న పాక్‌.. అక్కడ ఉద్యమకారులను అణచివేస్తోంది.  పాక్‌ సైన్యంతోపాటు డెత్‌స్క్వాడ్స్‌ చెలరేగిపోతున్నాయి. ఉగ్రసంస్థ లష్కరే తోయిబా సహకారంతో ఈ బృందాలు పౌరులను, బలోచ్‌ ఉద్యమకారులను హత్యలు చేస్తుంటాయి. వీటికి పాక్‌ ఐఎస్‌ఐ సహాయం చేస్తోంది. పక్కా నేరగాళ్లను ఎంచుకొని ఈ  బృందాలను తయారు చేస్తుంది. ఈ డెత్‌ స్క్వాడ్ల నిర్వాహకులు ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నారు. పాక్‌లోని డెత్‌స్క్వాడ్‌లలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి షఫీక్‌ మెంగల్‌. ఇతనికి లష్కరే, కశ్మీరీ జిహాదీలతో సంబంధాలు ఉన్నాయి. పాక్‌లోని ఖుజుదార్‌ అనే ప్రదేశంలో ప్రైవేటు జైళ్లను నడిపేవాడు. 2014లో ఇతను టూటక్‌ అనే ప్రదేశం వద్ద నడిపే ఒక ప్రైవేటు జైలు సమీపంలో సామూహిక సమాధులు బయటపడ్డాయి. వాధ్‌లో ఉగ్రక్యాంపులను కూడా నిర్వహిస్తుంటాడు. ఇతను రాజకీయాల్లోకి వెళ్లడంతో జకీరా మహమ్మద్‌ హుస్సేని ఈ స్థానాన్ని ఆక్రమించాడు. వీరితోపాటు ఫయాజ్‌ జంగ్వీ, యూనిస్‌ మహమ్మద్‌ షాలు కూడా డెత్‌స్క్వాడ్లను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలలోనే బలోచిస్థాన్‌లో 45 కిడ్నాప్‌లు జరిగాయి. వీటి వెనుక వీరి హస్తం ఉంది. ఇటీవల చనిపోయిన జర్నలిస్టు  సాజిద్‌ హుస్సేన్‌, అతని కుటుంబ మిత్రుల హత్యల్లో డెత్‌స్క్వాడ్‌ల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్టును చంపడంలో పాక్‌ సైన్యం  పాత్రకూడా ఉన్నట్లు సమాచారం. గతేడాది  పాక్‌లోని జియో టీవీకి చెందిన హమీద్‌ మీర్‌ అనే జర్నలిస్టును సైన్యం మాయం చేసింది. 

ఇదీ చదవండి...

యూకే ప్రయాణికుల్లో కరోనా..భారత్‌ అప్రమత్తం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని