ద.కొరియా మాజీ అధ్యక్షుడు మళ్లీ జైలుకే..!

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు లీ మ్యుంగ్-బాక్‌ తిరిగి జైలుకు వెళ్లారు. అవినీతి కేసులో దోషిగా తేలిన మాజీ అధ్యక్షుడికి 17ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పుచెప్పింది.

Published : 02 Nov 2020 18:32 IST

17ఏళ్ల శిక్షను సమర్థించిన ద.కొరియా సుప్రీంకోర్టు

సియోల్‌: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు లీ మ్యుంగ్-బాక్‌ తిరిగి జైలుకు వెళ్లారు. అవినీతి కేసులో దోషిగా తేలిన మాజీ అధ్యక్షుడికి 17ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పుచెప్పింది. తాజాగా ఈ నిర్ణయాన్ని ద.కొరియా అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. దీంతో లీ మ్యుంగ్‌-బాక్‌ జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇతని తర్వాత అధ్యక్ష పీఠాన్ని చేపట్టిన దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలు కూడా అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే.

2008-13కాలంలో దక్షిణ కొరియా అధ్యక్షుడిగా పనిచేసిన లీ, సాంసంగ్‌ వంటి పెద్ద వ్యాపార సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా పదవిలో ఉన్న కాలంలో మరికొన్ని అవినీతి నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసుల్లో లీ మ్యుంగ్‌-బాక్‌ను దోషిగా తేల్చిన సియోల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ 2018లో అతనికి 15ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. తర్వాత కొన్నిరోజులకే లీ బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే, అప్పీలేట్‌ కోర్టు ఇతని బెయిల్‌ రద్దుచేయడంతోపాటు శిక్షను 17ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అనంతరం, మళ్లీ బెయిల్‌పై మళ్లీ బయటకు వచ్చారు. తాజాగా ఈ కేసు దక్షిణ కొరియా సుప్రీంకోర్టుకు చేరింది. చివరకు సుప్రీంకోర్టు కూడా లీ మ్యుంగ్‌-బాక్‌కు విధించిన 17ఏళ్ల శిక్షను సమర్థించింది. దీంతో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 

లీ మ్యుంగ్-బాక్‌ హయాంలో ఆర్థిక సంక్షోభం, అమెరికా మాంసం దిగుమతులు, ఉత్తర కొరియాతో శత్రుత్వం వంటి అంశాలపై ద.కొరియాలో భారీ స్థాయిలో నిరసనలు మిన్నంటాయి. అతని తర్వాత 2013లో అధ్యక్ష పదవి చేపట్టిన పార్క్‌ గుయెన్‌ హై(68)కు కూడా ఈ నిరసనల సెగ తగిలింది. ఆమె కూడా మరో అవినీతి కేసులో ఇరుక్కున్నట్లు తేలింది. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా పేరొందిన ఆమె..అధికార దుర్వినియోగం, అవినీతి వంటి కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని