Shraddha Murder: హత్య తర్వాత.. శ్రద్ధా ఫోన్‌తోనే ముంబయి విచారణకు ఆఫ్తాబ్‌..!

శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన తర్వాత నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమె ఫోన్‌ను కొన్ని నెలల పాటు ఉపయోగించినట్లు తాజాగా తెలిసింది. ముంబయిలో విచారణకు వెళ్లినప్పుడు కూడా ఆ ఫోన్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం.

Published : 03 Dec 2022 13:31 IST

దిల్లీ: సంచలనం సృష్టించిన కాల్ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో రోజుకో విషయం బయటకొస్తోంది. శ్రద్ధాను చంపేసిన తర్వాత నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమె ఫోన్‌ను కొన్ని నెలల పాటు తన వద్దే ఉంచుకున్నట్లు పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి. ముంబయిలో పోలీసు విచారణకు వెళ్లినప్పుడు కూడా ఆ ఫోన్‌ను వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది.

మే 18న శ్రద్ధా వాకర్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలియని ఆమె తల్లిదండ్రులు ముంబయిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నవంబరు 3న ఆఫ్తాబ్‌ను ముంబయికి పిలిచి ప్రశ్నించారు. ఈ విచారణ సమయంలో శ్రద్ధా ఫోన్ అతడి వద్దే ఉందని తాజాగా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఫోన్‌తో తాను దొరికిపోతానని భావించిన నిందితుడు.. ముంబయి నుంచి దిల్లీకి తిరిగి వస్తుండగా.. సముద్రంలో విసిరేశాడు. ఫోన్‌ను సముద్రంలో పడేశానని ఆఫ్తాబ్.. నార్కో పరీక్షలో కూడా చెప్పినట్లు సమాచారం. ఫోన్‌తో పాటు హత్యకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలను కూడా నిందితుడు సముద్రంలో విసిరేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఇక హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆఫ్తాబ్‌ ముంబయికి వెళ్లాడు. శ్రద్ధా తనకు బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోయిందని స్నేహితులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆఫ్తాబ్‌.. శ్రద్ధా క్రెడిట్‌ కార్డు బిల్లులను కూడా ఆమె ఫోన్‌తోనే చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కేసులో ఆఫ్తాబ్‌కు డిసెంబరు 1న నార్కో పరీక్ష పూర్తి చేశారు. అంతకుముందు పాలిగ్రాఫ్‌ పరీక్ష కూడా జరిగింది. అయితే ఈ రెండు పరీక్షల్లోనూ ఆఫ్తాబ్‌ ఇచ్చిన సమాధానాలు ఒకేలా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు పోలీసు కస్టడీలో చెప్పిన విషయాలనే ఈ పరీక్షల్లోనూ చెప్పాడని సమాచారం. దీంతో అతడు ఈ పరీక్షల కోసం ముందుగానే రిహార్సల్ చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న శరీర భాగాలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక వస్తేనే గానీ ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పించట్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని