బ్లాక్‌ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించండి

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిని మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) ఇన్ఫెక్షన్‌ కలవరపెడుతోంది. దీంతో కేంద్రం దీన్ని అంటువ్యాధుల చట్టం (ఎపిడెమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌) కింద పరిగణించాలని రాష్ట్రాలను ఆదేశించింది.

Published : 20 May 2021 20:02 IST

రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

దిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిని మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) ఇన్‌ఫెక్షన్‌ కలవరపెడుతోంది. దీంతో కేంద్రం దీన్ని అంటువ్యాధుల చట్టం (ఎపిడెమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌) కింద పరిగణించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ రాష్ట్రాలకు లేఖను పంపారు. ఇకపై బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయిన వారి వివరాలను రాష్ట్రాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, కళాశాలలు బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ, చికిత్సకు కేంద్రం సూచించిన మార్గదర్శకాలు అనుసరించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాలు బ్లాక్‌ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,500 మందిలో బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించారు. వారిలో 90 మంది మరణించారు. రాజస్థాన్‌లో 100 మందికి పైగా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డారు. తమిళనాడులో ఈ తరహా కేసులు 9 నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని