Delhi: సరి-బేసి పద్ధతిలో మార్కెట్లు, మాల్స్‌

దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు వెయ్యికి దిగువనే నమోదవుతున్నాయి. దీంతో దిల్లీ ప్రభుత్వం ‘అన్‌లాక్‌’ ప్రక్రియ మొదలుపెట్టింది.

Published : 05 Jun 2021 13:31 IST

మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ కొనసాగింపు

సీఎం కేజ్రీవాల్‌ ప్రకటన

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు వెయ్యికి దిగువనే నమోదవుతున్నాయి. దీంతో దిల్లీ ప్రభుత్వం ‘అన్‌లాక్‌’ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నేడు లాక్‌డౌన్‌ నుంచి మరిన్ని సడలింపులు కల్పించింది. మార్కెట్లు, మాల్స్‌ను సరి-బేసి పద్ధతిలో తెరవాలని నిర్ణయించింది. ప్రైవేటు ఆఫీసులు కూడా 50శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేడు కీలక ప్రకటన చేశారు. 

‘‘మరిన్ని సడలింపులతో జూన్‌ 14 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నాం. మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ సరి-బేసి పద్ధతిలో తెరచుకుంటాయి. సగం దుకాణాలు ఒక రోజు.. మిగతా సగం మరుసటి రోజు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు ఆఫీసులు 50శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. అయితే మరి కొద్దిరోజులు వర్క్‌ఫ్రం హోం కొనసాగిస్తేనే మంచిది. మెట్రో సేవలు 50శాతం సామర్థ్యంతో నడుస్తాయి’’ అని కేజ్రీవాల్ వెల్లడించారు. పరిస్థితిని బట్టి రానున్న రోజుల్లో మరిన్ని సడలింపులు ఇస్తామని తెలిపారు. 

మూడో దశను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పీడియాట్రిక్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 420 టన్నుల ఆక్సిజన్‌ స్టోరేజీ కెపాసిటీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు రెండు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కేజ్రీవాల్‌ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని