తొలి దశలో అతిగా యాంటీబయోటిక్‌ల వాడకం

కొవిడ్‌ తొలి ఉద్ధృతి సమయంలో భారతీయులు యాంటీబయోటిక్‌ ఔషధాలను మితిమీరి ఉపయోగించారని

Published : 03 Jul 2021 10:19 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌ తొలి ఉద్ధృతి సమయంలో భారతీయులు యాంటీబయోటిక్‌ ఔషధాలను మితిమీరి ఉపయోగించారని తాజా అధ్యయనమొకటి తేల్చింది. గత ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య భారత్‌లో వయోజనులకు సంబంధించి 21.64 కోట్ల యాంటీబయోటిక్‌ డోసులు, 3.8 కోట్ల అజిత్రోమైసిన్‌ డోసులు అధికంగా అమ్ముడుపోయినట్లు నిర్ధారించింది. ఆ నాలుగు నెలల్లో దేశంలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతిని గుర్తుచేసింది. అమెరికాలోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు.. 2018 జనవరి నుంచి 2020 డిసెంబరు వరకు భారత్‌లో ప్రైవేటు రంగంలో నెలలవారీగా యాంటీబయోటిక్‌ల విక్రయాలను విశ్లేషించడం ద్వారా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.  గత ఏడాది దేశవ్యాప్తంగా 1629 కోట్ల యాంటీబయోటిక్‌ డోసులు అమ్ముడుపోయినట్లు వారు తెలిపారు. వాస్తవానికి 2018, 2019తో పోలిస్తే ఈ సంఖ్య కొంత తక్కువేనని పేర్కొన్నారు. అయితే- మొత్తం యాంటీబయోటిక్‌లలో వయోజనుల డోసులు 2018లో 72.6%గా, 2019లో 72.5%గా ఉండగా.. గత ఏడాది అది 76.8%కు పెరిగిందన్నారు. వయోజనుల్లో అజిత్రోమైసిన్‌ వాడకం గత ఏడాది 5.9%కు చేరుకుందని చెప్పారు. అది 2018లో కేవలం 4%గా, 2019లో 4.5%గా ఉందని పేర్కొన్నారు. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లపై ఉపయోగించే డాక్సీసైక్లిన్, ఫారోపెనమ్‌ ఔషధాల వినియోగమూ గత ఏడాది పెరిగినట్లు చెప్పారు.

అమెరికా సహా పలు ఇతర అధిక ఆదాయ దేశాల్లో మాత్రం మహమ్మారి వేళ యాంటీబయోటిక్‌ డోసుల విక్రయాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. కరోనా నియంత్రణ ఆంక్షల నేపథ్యంలో భారత్‌లో గత ఏడాది మలేరియా, డెంగీ, గన్యా తదితర వ్యాధుల బారిన పడ్డవారి సంఖ్య తగ్గిందని వెల్లడించారు. కాబట్టి వాస్తవానికి యాంటీబయోటిక్‌ల వినియోగం తగ్గాల్సి ఉన్నా.. కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలు వాటిని ఎక్కువగా ఉపయోగించారని పేర్కొన్నారు. భారత్‌లో కొవిడ్‌ బారిన పడ్డవారిలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక యాంటీబయోటిక్‌ ఔషధాన్ని తీసుకున్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలుస్తోందని పరిశోధకులు చెప్పారు. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లపై మాత్రమే యాంటీబయోటిక్‌ ఔషధాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని, కొవిడ్‌ వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై అవి సమర్థంగా పనిచేయవన్న సంగతిని గుర్తించాలని సూచించారు. వాటిని అతిగా వినియోగిస్తే.. ఔషధ నిరోధక వ్యాధుల ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని