Jammu And Kashmir: దేశంలో తొలిసారి భారీగా లిథియం నిల్వలు వెలుగులోకి..!

దేశంలోనే తొలిసారి లిథియం నిల్వలను భారీగా కనుగొన్నారు. దీంతో విద్యుత్తు వాహనాలు, స్మార్ట్‌ఫోన్ల తయారీ పరిశ్రమలకు మరింత బలం లభించనుంది. 

Updated : 10 Feb 2023 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్యాటరీలు, ఇతర విద్యుత్తు పరికరాల తయారీలో అత్యంత కీలకమైన లిథియం(Lithium) నిల్వలు భారత్‌లో తొలిసారి భారీగా వెలుగు చూశాయి. జమ్ము-కశ్మీర్‌లో 59 లక్షల టన్నులు లిథియం(Lithium) రిజర్వులు వెలుగు చూసినట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది.‘‘జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తొలిసారి జమ్ము కశ్మీర్‌(Jammu And Kashmir) కేంద్ర పాలిత ప్రాంతంలోని రియాసి జిల్లాలో సలాల్‌ హైమాన ప్రాంతంలో లిథియం(Lithium) నిల్వలు కనుగొంది’’ అని గనుల శాఖ ట్విటర్‌లో పేర్కొంది.

దేశ వ్యాప్తంగా గనుల శాఖ మొత్తం 51 ఖనిజ క్షేత్రాలను గుర్తించింది. వాటిని గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. వీటిల్లో మొత్తం 5 క్షేత్రాల్లో  బంగారం నిల్వలను కనుగొన్నారు. మిగిలిన చోట్ల పొటాష్‌, మాలిబ్డినం, ఇతర ప్రాథమిక లోహాలను గుర్తించారు. జమ్ముకశ్మీర్‌, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిస్సా, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. 2018-19 మధ్య నిర్వహించిన సర్వేల ఆధారంగా గుర్తించారు.  వీటిల్లో 17 చోట్ల 7,897 మిలియన్‌ టన్నుల బొగ్గు, లిగ్నైట్‌ ఉన్న గనులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించింది.

మరింత చౌకగా విద్యుత్తు వాహనాలు.. స్మార్ట్‌ఫోన్లు..

ప్రభుత్వం గత కొన్నేళ్లుగా దేశీయంగా విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా పలు పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాదు..ఈవీల ధరలు తక్కువగా ఉండటానికి పలు పన్ను ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌ లిథియం(Lithium), నికెల్‌, కోబాల్ట్‌ వంటి లోహాలను దిగుమతి చేసుకుంటోంది. తాజాగా జమ్ము కశ్మీర్‌లో 59 లక్షల టన్నుల లిథియం(Lithium) నిల్వలు కనుగొనడంతో భవిష్యత్తులో విద్యుత్తు వాహన తయారీ రంగానికి మరింత బలం చేకూరనుంది. ఈ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం చాలా కీలకం. భవిష్యత్తులో దీని  దిగుమతులు తగ్గే అవకాశాలున్నాయి. అంతేకాదు, బ్యాటరీ ధరలు కూడా దిగిరానున్నాయి. జమ్ము కశ్మీర్‌లో లిథియం నిల్వలు కనుగొనడంపై గనులశాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్‌ మాట్లాడుతూ ‘‘స్వయంసమృద్ధి సాధించే దశలో విలువైన ఖనిజాలు కనుగొనడం, వాటిని ప్రాసెస్‌ చేయడం చాలా కీలకమం’’ అని పేర్కొన్నారు. 

లిథియం(Lithium) కేవలం విద్యుత్తు వాహనాలకే కాదు.. స్మార్ట్‌ఫోన్ల తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల తయారీపై భారత్‌ దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్లలో లిథియం(Lithium) అయాన్‌ బ్యాటరీలనే వినియోగిస్తున్నారు. లిథియం ధరలు తగ్గేకొద్దీ భారత్‌లో మరింత చౌకగా ఫోన్లు తయారవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని