Juhi Chawla: 5జీపై పిటిషన్‌ ఎందుకు వేశానంటే..

దేశంలో 5టీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసి కోర్టు ఆగ్రహానికి, జరిమానాకు గురైన బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా తాజాగా ఆ పరిణామాలపై స్పందించారు.

Updated : 09 Jun 2021 16:34 IST

వీడియో షేర్‌ చేసిన బాలీవుడ్‌ నటి

దిల్లీ: దేశంలో 5టీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసి కోర్టు ఆగ్రహానికి, జరిమానాకు గురైన బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా తాజాగా ఆ పరిణామాలపై స్పందించారు. తాను ఆ పిటిషన్‌ ఎందుకు వేశానో చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. 5జీ నెట్‌వర్క్‌కు తాను వ్యతిరేకం కాదని, అయితే అది పూర్తిగా భద్రమైనదే అని అధికారులు హామీ ఇవ్వాలని కోరారు.

‘‘గత కొన్ని రోజులుగా నా పిటిషన్‌పై ఎన్నో విమర్శలు, అభ్యంతరాలు వస్తున్నాయి. అవన్నీ నేను వినలేకపోతున్నాను. అయితే  వాటిలో ఒక అత్యంత ముఖ్యమైన అంశాన్ని విస్మరిస్తున్నాం. మేం 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకం కాదు. నిజానికి మేం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే అది పూర్తిగా భద్రమైనదే అని అధికారులు ధ్రువీకరించాలి. అధ్యయనాలను ప్రచురితం చేయాలి. పరిశోధనలు జరపాలి. ఈ నెట్‌వర్క్‌ వల్ల పిల్లలకు, గర్భిణీలకు, గర్భంలో ఉన్న శిశువులకు ఎలాంటి హానీ ఉండదని హామీ ఇవ్వాలి. అప్పుడే మాకున్న భయాలు తొలగిపోతాయి. అప్పుడే మేం ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం’’అని జుహీ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. 

5జీ సేవల ఏర్పాటుకు వ్యతిరేకంగా నటి జుహీ, వీరేశ్‌ మాలిక్‌, టీనా వచానీ ఇటీవల దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీలో ఉండే రేడియేషన్‌ వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని, మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్లు అధిక ప్రభావం పడుతుందని పిటిషనర్లు ఆరోపించారు. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, కోర్టు విచారణ లింక్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేసినందుకుగానూ పిటిషనర్లకు రూ. 20లక్షల జరిమానా విధించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని