Gulf countries: ఇకపై తక్కువ ఖర్చుతో గల్ఫ్‌ ప్రయాణం!

కేరళ తీరం (Kerala Coast) నుంచి గల్ఫ్‌కు ప్యాసింజర్‌ షిప్‌ నడపాలని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సన్నాహాలు మొదలుపెట్టింది.

Published : 01 Jun 2023 21:41 IST

తిరువనంతపురం: బతుకుదెరువు కోసం చాలా మంది భారత్‌ (India) నుంచి గల్ఫ్‌ దేశాలకు (Gulf Countries) వెళ్తుంటారు. విమాన ఛార్జీలు పెరిగిపోతుండటంతో వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఎంత డబ్బు పెట్టినా టికెట్‌ దొరకని పరిస్థితి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం (LDF Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ తీరం (Kerala Coast) నుంచి గల్ఫ్‌కు ప్యాసింజర్‌ షిప్‌ నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర పోర్టుల శాఖ మంత్రి అహ్మద్‌ దేవర్‌కోవిల్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మలబార్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, కేరళ మారిటైమ్ బోర్డు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రవాస కేరళీయుల వ్యవహారాల శాఖ (నార్కా) సహకారంతో ప్యాసింజర్‌ నౌక సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అధిక ఛార్జీల సమస్యను తగ్గించేందుకు కేరళ ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించినట్లు మంత్రి దేవర్‌కోవిల్ వెల్లడించారు. ఈ మొత్తంతోనే తాజాగా షిప్‌ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ముందుకొస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి కేరళ మారిటైమ్‌ బోర్డు ఛైర్మన్‌ ఎన్‌ఎస్‌ పిల్లై, సీఈవో సలిమ్‌కుమార్‌, నార్కా జనరల్‌ మేనేజర్‌ అజిత్‌ కొలస్సెరీ, ఎండీసీ అధ్యక్షుడు సీఈ చకున్ని తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని