23న మోదీతో 10 పార్టీ నేతల భేటీ.. ఏకతాటిపైకి నితీశ్‌, తేజస్వి!

దేశవ్యాప్తంగా కులాల వారీగా జనగణన చేపట్టాలన్న డిమాండ్‌తో 10 పార్టీలకు చెందిన ప్రతినిధులు సోమవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ బృందానికి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వం వహించనున్నారు.

Published : 21 Aug 2021 22:55 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కులాల వారీగా జనగణన చేపట్టాలన్న డిమాండ్‌తో 10 పార్టీలకు చెందిన ప్రతినిధులు సోమవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ బృందానికి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో బిహార్‌ ప్రతిపక్ష నేత, ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్‌ కూడా ఉన్నారు. ఉప్పూనిప్పులా ఉండే వీరిద్దరూ ఈ విషయంలో ఏకతాటిపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం 11 గంటలకు తమ బృందం ప్రధానిని కలవనుందని నితీశ్‌ కుమార్‌ శనివారం వెల్లడించారు. ప్రధానితో భేటీలో సానుకూల నిర్ణయం వెలువడతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కులాల వారీగా జనగణన వల్ల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.

దేశవ్యాప్తంగా కులాల ఆధారంగా జనగణన డిమాండ్‌ను గత కొంతకాలంగా నితీశ్‌ తెరపైకి తెస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ మినహా మిగిలిన కులాల వారీగా జనగణన చేపట్టే ఉద్దేశమేదీ లేదంటూ కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఇటీవల పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చిన నేపథ్యంలో ఈ డిమాండ్‌ మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు 10 పార్టీలు సిద్ధమయ్యాయి. గతంలో ఇదే అంశంపై 2019, 2020ల్లో బిహార్‌ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని