సుప్రీంలో 70,154.. హైకోర్టుల్లో 58 లక్షలకు పైనే కేసుల పెండింగ్‌: కేంద్రం

దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈనెల 2 వరకు .......

Published : 26 Mar 2022 01:45 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈనెల 2 వరకు ఒక్క సుప్రీంకోర్టులోనే 70,154 కేసులు పెండింగ్‌లో ఉండగా.. మార్చి 21 నాటికి 25 హైకోర్టుల్లో 58,94,060 పెండింగ్‌ కేసులు ఉన్నట్టు లోక్‌సభకు తెలిపింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ గణాంకాలను వెల్లడించారు.

వివిధ జిల్లా కోర్టులు, సబార్డినేట్‌ కోర్టుల్లో కలిపి 4,10,47,976 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులకు సంబంధించిన గణాంకాలు నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌లో అందుబాటులో లేవన్నారు. దేశవ్యాప్తంగా మొత్తంగా 4,70,12,190 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. పెండింగ్‌ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థ పరిధిలోనిదని, ఆయా కోర్టుల్లో పలు రకాల కేసుల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితీ నిర్దేశించలేదన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. న్యాయమూర్తుల ఖాళీలు, తరచూ కేసులు వాయిదా పడటంతో పాటు విచారణల కోసం కేసుల్ని పర్యవేక్షించేందుకు, ట్రాక్‌ చేయడానికి తగిన ఏర్పాట్లు లేవని గమనించినట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని