SC: హత్యాచార కేసులో ఉరిశిక్ష రద్దు.. ఆ ముగ్గురూ నిర్దోషులే: సుప్రీంకోర్టు

సామూహిక అత్యాచార కేసులో దిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించిన ముగ్గురు దోషులకు సుప్రీంకోర్టు కేసు నుంచి విముక్తి కల్పించింది. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.

Updated : 07 Nov 2022 15:37 IST

దిల్లీ: పదేళ్ల కిందట దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఓ సామూహిక అత్యాచార, హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు దోషులకు దిల్లీ హైకోర్టులో మరణశిక్ష పడగా.. వారిని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది.

2012లో దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో ఓ 19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారం, హత్యకు గురైంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన దిల్లీ పోలీసులు ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రవి కుమార్‌, రాహుల్‌, వినోద్‌ అనే యువకులు ఆ యువతిని కిడ్నాప్‌ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. అత్యాచారం అనంతరం ఆమెను అత్యంత పాశవికంగా చిత్రహింసలు పెట్టి చంపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. హతురాలి మృతదేహాన్ని హరియాణాలోని ఓ పొలంలో గుర్తించారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఈ కేసులో తొలుత విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు.. ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించి మరణ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ట్రయల్‌ కోర్టు తీర్పును సమర్థించింది. ఈ హత్యాచార ఘటనను ‘అత్యంత దారుణమైనది’గా అభివర్ణించిన హైకోర్టు.. నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ 2014లో  తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీనిపై సుప్రీంకోర్టు ఇటీవల విచారణ జరిపింది.  దోషుల పిటిషన్‌ను దిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. అయితే దోషుల తరఫున డిఫెన్స్‌ కౌన్సిల్‌ వాదిస్తూ.. వారి వయసు, కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శిక్షపై తీర్పు వెలువరించాలని కోరారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. దోషుల ఉరిశిక్షను రద్దు చేయడమే గాక.. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పుపై బాధితురాలి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని