Vaccine: కేంద్రంపై సుప్రీం ప్రశ్నల వర్షం

దేశంలో ఉచిత వ్యాక్సిన్‌ అంశంపై కేంద్రం అవలంభిస్తున్న విధానాలను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తూ.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి రుసుము వసూలు చేయడం సహేతుకం కాదని స్పష్టం చేసింది...

Updated : 02 Jun 2021 18:06 IST

దిల్లీ: దేశంలో ఉచిత వ్యాక్సిన్‌ అంశంపై కేంద్రం అవలంబిస్తున్న విధానాలను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తూ.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి రుసుము వసూలు చేయడం సహేతుకం కాదని స్పష్టం చేసింది. కొవిడ్‌ రెండో దశ వ్యాప్తిలో ఎక్కువ మంది బాధితులు ఈ వయస్సు వారేనని అభిప్రాయపడింది. అంతేకాకుండా వైరస్‌ ప్రభావం కూడా వీరిపై ఎక్కువగానే ఉందని, చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ విధానాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీం ఇవాళ  విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా కీలకమని వ్యాఖ్యానించింది. వ్యాక్సినేషన్‌ అమలు విధానంలో చాలా లోపాలు ఉన్నాయనీ, వెంటనే వాటిని సమీక్షించి, నివృత్తి చేసుకోవాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

డిసెంబరు 31 నాటికి అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. ఎలా ముందుకెళ్తారన్న దానిపై రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని సుప్రీం ఆదేశించింది. వ్యాక్సిన్‌ ధరలపై కేంద్రం మరోసారి పరిశీలించాలని చెప్పింది. వ్యాక్సిన్‌ కొనుగోలు వివరాలను, వ్యాక్సిన్‌ విధానానికి సంబంధించిన అన్ని పత్రాలు కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాల సమీకరణకు ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని సుప్రీం ఆదేశించింది. ‘‘నివేదికలను పరిశీలిస్తే 18-44 మధ్య వయస్సు వారికి వైరస్‌ సోకడమే కాదు.. కొంతమందిపై తీవ్ర ప్రభావమూ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుల కొద్దీ ఆస్పత్రుల్లో ఉండాల్సిన పరిస్థితులూ ఎదురవుతున్నాయి. కొన్ని మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వైరస్‌లో మార్పులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో 18-44 వయస్సు వారికి కూడా వ్యాక్సిన్‌ వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే  ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది శాస్త్రీయపద్ధతుల ద్వారా నిర్ణయించాలి’’ అని సుప్రీం స్పష్టం చేసింది.

18-44 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన అవసరాన్ని సుప్రీం నొక్కి చెప్పింది. తొలి రెండు విడతల్లో కేంద్రం వ్యాక్సిన్లను ఉచితంగానే అందించిందని గుర్తు చేసింది. ఆ తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్లను కొనుగోలు చేసి, ప్రజల నుంచి కొంత మొత్తం వసూలు చేసి టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమతించడం సహేతుకం కాదని సుప్రీం స్పష్టం చేసింది. మరోవైపు కార్యనిర్వాహక వ్యవస్థ విధానాలపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదన్న వాదనపై సుప్రీం తీవ్రంగా స్పందించింది. కార్యనిర్వాహక విధానాల వల్ల పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఘాటుగా వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని