PM Modi: ‘సోదరా.. విశ్రాంతి కూడా తీసుకో’.. ప్రధాని మోదీకి అన్న ఇచ్చిన సలహా!

గుజరాత్‌లో నేడు రెండో, చివరి దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు సోమాభాయ్‌ మోదీ తన ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ఆదివారం ప్రధాని మోదీ తమతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని భావోద్వేగులయ్యారు.

Published : 05 Dec 2022 17:15 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో నేడు రెండో, చివరి దశ ఎన్నికల పోలింగ్‌(Gujarat Election 2022) కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అహ్మదాబాద్‌లోని రాణిప్‌ ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని సోదరుడు సోమాభాయ్‌ మోదీ(Somabhai Modi) సైతం అదే పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. అనంతరం ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ఆదివారం ప్రధాని మోదీ తమతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని భావోద్వేగులయ్యారు.

‘దేశం కోసం విరామం లేకుండా పని చేస్తున్న నేపథ్యంలో.. కాస్త విశ్రాంతి కూడా తీసుకోవాలని సోదరుడి(ప్రధాని మోదీ)ని కోరాను’ అని సోమాభాయ్ ఈ సందర్భంగా వెల్లడించారు. 2014 నుంచి జాతీయ స్థాయిలో జరుగుతోన్న అభివృద్ధిని దేశ ప్రజలు విస్మరించలేరని, దాని ఆధారంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికులు ఓటేస్తారని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ప్రజలంతా బాధ్యతగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా.. గుజరాత్‌ తుది విడత పోలింగ్ వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన కుటుంబ సభ్యులను కలుసుకున్న విషయం తెలిసిందే. గాంధీనగర్‌లోని రైసన్‌ ప్రాంతంలో ఉంటున్న తన తల్లి హీరాబెన్‌ మోదీ నివాసానికి వెళ్లి.. ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని