Rana: గుర్తుండిపోయే కథ ఇది

రక్షిత్‌ శెట్టి కథానాయకుడిగా కిరణ్‌ రాజ్‌.కె తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘777 ఛార్లి’. ఓ కుక్క టైటిల్‌ పాత్ర పోషించింది. సంగీత శ్రింగేరి కథానాయిక. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించారు. రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 29 May 2022 07:31 IST

క్షిత్‌ శెట్టి కథానాయకుడిగా కిరణ్‌ రాజ్‌.కె తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘777 ఛార్లి’. ఓ కుక్క టైటిల్‌ పాత్ర పోషించింది. సంగీత శ్రింగేరి కథానాయిక. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించారు. రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు, నటుడు రానా మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో రక్షిత్‌తో మాట్లాడినప్పుడు ఈ చిత్రం గురించి చెప్పాడు. ఏదో చిన్న ప్రయోగం చేస్తున్నాడులే అనుకున్నా. ట్రైలర్‌ చూశాక తనెంత భారీ స్కేల్‌లో ఈ సినిమా తీశాడో అర్థమైంది. అది చూశాక నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సినిమా చూశాక కచ్చితంగా మీరు నవ్వుతారు, ఏడుస్తారు. అంతకంటే గొప్పగా ఈ కథ మీ జీవితాల్లో ఉండిపోతుంది’’ అన్నారు. ‘‘ఓ నటుడిగా నేనిప్పటి వరకు చేసిన చిత్రాల్లో అత్యంత కష్టపడిన చిత్రమిదే. ప్రతి సినిమాలోనూ రకరకాల సవాళ్లుంటాయి. ఓ జంతువుతో కలిసి చేయడానికి చాలా ఓపిక కావాలి. సెట్లో ఒక్కో సీన్‌ పూర్తి చేయడానికి కనీసం ముప్పై.. నలభై టేక్స్‌ తీసుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఒక్క షాట్‌ పూర్తి చేయడానికి రోజంతా పట్టేది. ఈ చిత్రంలో నేను ధర్మ అనే పాత్రలో కనిపిస్తా. తనదొక ఏకాంత ప్రపంచం. ఒంటరిగా జీవిస్తుంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఛార్లి అనే కుక్క ప్రవేశించాక ఎలాంటి మార్పులొచ్చాయి? అతనిలో దాగున్న ప్రేమను అదెలా బయటకు తీసింది? అన్నది చిత్ర కథాంశం. ఇలాంటి చిత్రం గత పదేళ్లలో రాలేదు. రాబోయే పదేళ్లలోనూ రాదు. అంత కష్టమైన చిత్రమిది. ట్రైలర్‌ లాగే సినిమా అందరినీ మెప్పిస్తుంది’’ అన్నారు నటుడు రక్షిత్‌ శెట్టి. నటి సంగీత మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నేను దేవికా ఆరాధ్య అనే పాత్ర పోషించా. యానిమల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా కనిపిస్తా. ఈ సినిమాతో ప్రయాణం నాకెంతో ప్రత్యేకం. ఇలాంటి చిత్రాలు చేయడానికి నిజంగా చాలా ఓపిక కావాలి’’ అంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని