Salaar: ‘సలార్‌’.. మళ్లీ షురూ

కథానాయకుడు ప్రభాస్‌ ఇంట ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో సెప్టెంబరు 11న కన్నుమూయడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బుధవారంతో ఆయన దశదిన కర్మలు పూర్తయ్యాయి

Updated : 24 Sep 2022 14:01 IST

కథానాయకుడు ప్రభాస్‌ (Prabhas) ఇంట ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో సెప్టెంబరు 11న కన్నుమూయడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బుధవారంతో ఆయన దశదిన కర్మలు పూర్తయ్యాయి. దీంతో తనని నమ్ముకున్న దర్శక నిర్మాతల కోసం తిరిగి సెట్‌లోకి అడుగు పెట్టారు ప్రభాస్‌. ‘సలార్‌’ (Salaar) చిత్రాన్ని పునఃప్రారంభించారు. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో తాజాగా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌ కోసమే ఇప్పటికే అక్కడ 12 ప్రత్యేక సెట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడు వీటిలోనే ప్రభాస్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రానికి సంగీతం: రవి బసూర్‌, ఛాయాగ్రహణం: భువన గౌడ్‌.


వచ్చే నెల నుంచి బరిలోకి

వరుణ్‌ తేజ్‌ 13వ (Varuntej) సినిమాపై ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ ద్విభాషా చిత్రం నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే దీనికి ముందుగానే తన 12వ సినిమాని పట్టాలెక్కించనున్నారు వరుణ్‌. ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న చిత్రమిది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుంది. పూర్తిగా లండన్‌ నేపథ్యంలో సాగుతుంది. ఇది అక్టోబరు రెండో వారంలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుందని సమాచారం. ఇందుకోసం లండన్‌ వెళ్లేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది చిత్ర బృందం. దాదాపు నెలకు పైగా సాగే తొలి షెడ్యూల్‌లో భాగంగా పలు కీలక సన్నివేశాలతో పాటు పోరాట ఘట్టాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే వరుణ్‌ 13వ సినిమా మొదలుకానుంది. ఈ రెండు చిత్రాల్ని సమాంతరంగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని