భీమ్లా నాయక్‌గా పవన్‌ వచ్చాడు.. సింగరాయ్‌గా నాని పూర్తి చేశాడు..!

కరోనా సెకండ్‌వేవ్‌ చాలావరకూ తగ్గుముఖం పట్టడంతో సినీ పరిశ్రమలో పనులు వేగవంతమయ్యాయి. మరో కొన్నిరోజుల్లో థియేటర్లు పునఃప్రారంభమవుతుండటంతో కొన్ని సినిమాలు థియేటర్‌ రిలీజ్‌లకు సిద్ధమవుతున్నాయి...

Updated : 26 Jul 2021 15:21 IST

టాలీవుడ్‌ లేటెస్ట్‌ అప్‌డేట్స్

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా సెకండ్‌వేవ్‌ చాలా వరకూ తగ్గుముఖం పట్టడంతో సినీ పరిశ్రమలో పనులు వేగవంతమయ్యాయి. మరి కొన్నిరోజుల్లో థియేటర్లు పునః ప్రారంభమవుతుండటంతో కొన్ని సినిమాలు రిలీజ్‌లకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్‌లు షూటింగ్స్‌ పూర్తి చేసే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన లవ్లీ అప్‌డేట్స్‌ ప్రేక్షకుల్ని ఫిదా చేశాయి.. ఇంతకీ అవేమిటంటే..

భీమ్లానాయక్‌ ఆన్‌ డ్యూటీ

పవన్‌కల్యాణ్‌-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూట్‌ సోమవారం తిరిగి పట్టాలెక్కింది. ఇందులో పవన్‌-రానాలపై యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెటిజన్ల టీజ్‌ చేసే విధంగా చిత్రబృందం ఓ పిక్‌ని షేర్‌ చేసింది. ఇందులో పవన్‌కల్యాణ్‌ పోలీస్‌ దుస్తుల్లో వెనుక నుంచి కనిపించారు. ‘భీమ్లానాయక్‌ ఆన్‌ డ్యూటీ’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ మేరకు పవన్‌ పాత్ర పేరు ‘భీమ్లానాయక్‌’ అని అర్థమవుతోంది. మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్ ఈ సినిమా వస్తోన్న విషయం విదితమే.


సింగరాయ్‌ పూర్తి చేసేశాడు..!

యువ కథానాయకుడు నాని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ సోమవారంతో పూర్తయ్యింది. ఈ విషయాన్ని నాని ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. నిర్మాణాంతర పనులు ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


మల్టీ స్టారర్‌ - ఖిలాడీ మొదలయ్యాయి

కథానాయికలు రెజీనా-నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో ఓ సరికొత్త యాక్షన్‌ కామెడీ సినిమా సిద్ధమవుతోంది. కొరియన్‌ సినిమా ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూట్‌ పునఃప్రారంభమైందని చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. మరోవైపు, రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఖిలాడి’ షూట్‌ కూడా పట్టాలెక్కింది. రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ చాలా వరకూ పూర్తయ్యింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని