Adipurush: ‘ఆది పురుష్‌’ ఉచిత టికెట్లు పబ్లిసిటీ స్టంట్‌ కాదు: టీజీ విశ్వప్రసాద్

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘ఆది పురుష్‌’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడారు.

Published : 13 Jun 2023 18:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆదిపురుష్‌’ (Adipurush) ప్రదర్శిస్తున్న థియేటర్‌లలో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు కేటాయించడం, పలువురు సినీ ప్రముఖులు ఉచిత టికెట్లు ఇవ్వడం పబ్లిసిటీ స్టంట్‌ కాదని సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ (tg vishwa prasad) అన్నారు. ‘ఆది పురుష్‌’ చిత్రాన్ని తెలుగులో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం టీజీ విశ్వ ప్రసాద్‌ విలేకరులతో మాట్లాడారు. ఉచిత టికెట్లు, హనుమంతుడికి ప్రతి థియేటర్‌లో ఒక సీటు కేటాయించడం అనేది అది ఆయన పట్ల ఉన్న భక్తికి, గౌరవానికి నిదర్శనమన్నారు. ఉచిత టికెట్లు అనేది పబ్లిసిటీ స్టంట్ కాదని, ఇలాంటి సినిమాకి తమ వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వారంతట వారే ముందుకొచ్చి చేస్తున్నారని తెలిపారు.

‘‘ఆదిపురుష్’పై భారీ అంచనాలున్నాయి. మంచి ధరకు ఈ సినిమా తెలుగు రైట్స్‌ని తీసుకున్నాం. భవిష్యత్ లోనూ టి.సిరీస్ నిర్మించే సినిమాలతో అవగాహన ఉంటుంది. ప్రభాస్‌-సందీప్‌ వంగాల ‘స్పిరిట్’ని కూడా తెలుగులో మేమే విడుదల చేస్తాం. సినిమా అనేది ఒక ప్రయాణం. ఇందులో విజయాలు, పరాజయాలు ఉంటాయి. పరాజయాల నుంచి కొత్త విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి’’

‘‘వేగంగా వంద సినిమాలు నిర్మించాలనేది ఇటీవల పెట్టుకున్న లక్ష్యం. త్వరలోనే మా బ్యానర్‌లో 25 సినిమాలు పూర్తవుతాయి. మా మొదటి 25 సినిమాల కోసం మేం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాం. కానీ తదుపరి 25 సినిమాలను వేగంగా ఏడాదిన్నరలో పూర్తి చేసి, 50 సినిమాల మార్క్‌ని అందుకుంటాం. మా 25వ సినిమా ‘బ్రో’. మా 50 వ సినిమా ప్రకటన అనేది మరో ఆరు నెలల్లో ఉండొచ్చు. హాలీవుడ్ సినిమాలు నిర్మించడానికి ఇంకా సమయం ఉంది.

‘‘ప్రభాస్-మారుతితో సినిమా చేస్తున్నాం. అధికారికంగా ప్రకటించకపోవడానికి కారణం ఉంది. ఎందుకంటే ప్రతి సినిమాకి ఓ ప్లాన్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు ప్రకటిస్తాం. ఆ సినిమా విడుదల తేదీ, ఇతర విషయాల గురించి ఇప్పుడే చెప్పలేను’’

ప్రభాస్‌ (Prabhas) కీలక పాత్రలో ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ మూవీ ‘ఆది పురుష్‌’. ఓం రౌత్‌ దర్శకుడు. కృతిసనన్‌ (Kriti Sanon) జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) లంకేష్‌గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌16న (Adipurush release date) ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని