డాలస్‌లో గాంధీ మెమోరియల్‌ వద్ద ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోనే......

Published : 17 Aug 2021 18:28 IST

డాలస్/ టెక్సాస్: అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికా డాలస్‌లోని అతి పెద్దదైన గాంధీ మెమోరియల్ వద్ద 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రవాస భారతీయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ వేడుకలు జరుపుకొన్నారు. పిల్లలు, పెద్దల కేరింతల మధ్య భారత జాతీయ పతాకాన్ని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ సహా ఎంతోమంది జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న 75ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో మనం అనేక రంగాలలో ఎంతో ప్రగతి సాధించినా, ఇప్పటికీ కొన్ని వేల గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం వంటి కనీస వసతులు లేకపోవడం శోచనీయమన్నారు. పాలకులు చిత్తశుద్ధితో, ప్రజలు అంకితభావంతో కలిసి పనిచేస్తే తప్ప ఆశించిన అభివృద్ధి సాధించలేమన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు మన దేశాభివృద్ధిలో తమ వంతు కృషితో పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, బోర్డు సభ్యులు, కమ్యూనిటీ నాయకులు ఉర్మీత్ జునేజా, సల్మాన్ ఫర్షోరి, దినేష్ హూడా, షబ్నం మోడ్గిల్, ఎం.వి.ఎల్ ప్రసాద్, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, పులిగండ్ల విశ్వనాథం, ములుకుట్ల వెంకట్‌తో పాటు పలువురు చిన్నారులు, పెద్దలు గాంధీజీకి నివాళులర్పించి మిఠాయిలు పంచుకొన్నారు. చిరు జల్లుల మధ్య ఆహ్లాదంగా గడిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని