icon icon icon
icon icon icon

సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు

భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్‌ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది.

Updated : 20 Apr 2024 12:51 IST

ఇప్పటిదాకా 130 స్థానాల్లో అభ్యర్థులను మార్చిన భాజపా

ఈనాడు, దిల్లీ: భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్‌ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. మధ్యప్రదేశ్‌లో ఐదుగురు, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో ముగ్గురు చొప్పున ఎంపీలు అసెంబ్లీకి ఎన్నికవడంతో వారి స్థానాల్లో కొత్తవారిని తీసుకొచ్చింది. హరియాణా, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒక్కో సిట్టింగ్‌ ఎంపీ కన్నుమూశారు. రాజస్థాన్‌లో ఒకరు, హరియాణాలో మరొకరు భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. దాంతో ఆయా స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించింది. పశ్చిమబెంగాల్‌లో ఇద్దరిని, దిల్లీ, కర్ణాటకల్లో ఒక్కో సిట్టింగ్‌ ఎంపీని ఒక స్థానం నుంచి మరో స్థానానికి మార్చింది. ఈ 20 సీట్లను మినహాయిస్తే.. మిగిలిన 110 చోట్ల సిట్టింగ్‌లకు టికెట్‌ నిరాకరించి, కొత్తవారిని రంగంలోకి దించింది.


11 మంది కేంద్రమంత్రులకు మొండిచేయి

స్థానిక సామాజిక పరిస్థితులు, విజయావకాశాలు, పనితీరు సరిగా లేకపోవడం, అనారోగ్యం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తదితర కారణాలతో భాజపా ఈ దఫా 11 మంది కేంద్రమంత్రులకు టికెట్‌ నిరాకరించింది. ఈ జాబితాలో అశ్వినీకుమార్‌ చౌబే, జనరల్‌ వీకే సింగ్‌, దర్శనావిక్రమ్‌ జర్దోస్‌, మీనాక్షి లేఖి, సోమ్‌ప్రకాశ్‌, రామేశ్వర్‌ తేలీ, ఎ.నారాయణ స్వామి, ప్రతిమాభౌమిక్‌, రాజ్‌కుమార్‌ రంజన్‌సింగ్‌, బిశ్వేశ్వర్‌ టుడు, మంజుపారా మహేంద్రభాయ్‌ ఉన్నారు. పంజాబ్‌లోని హోశియార్‌పుర్‌లో కేంద్రమంత్రి సోమ్‌ప్రకాశ్‌ను పక్కనపెట్టినప్పటికీ.. ఆ స్థానంలో ఆయన సతీమణికి అవకాశం కల్పించారు.


360 డిగ్రీల పరిశీలన

ఈ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా నాయకత్వం.. అభ్యర్థుల ఎంపికలో 360 డిగ్రీల పరిశీలన చేపట్టింది. ఏ చిన్న కోణాన్నీ వదిలిపెట్టకుండా అంతర్గత సర్వేలు, ప్రజల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో పార్టీకి మొత్తం 26 మంది సిట్టింగ్‌ ఎంపీలు ఉండగా.. వారిలో ఏకంగా 14 మందిని ఇంటికి సాగనంపింది. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలోనూ భారీగానే సిట్టింగ్‌లకు మొండిచేయి చూపింది. భాజపా నాయకత్వ వ్యవహారశైలిని వ్యతిరేకించే విధంగా పత్రికల్లో వ్యాసాలు రాసినందుకు వరుణ్‌గాంధీని, తన కుమారుడికి టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ మారుతానన్నట్లు వ్యవహరించిన రీటా బహుగుణను, 400కుపైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్నందుకు అనంతకుమార్‌ హెగ్డేను, చట్టసభలో మైనార్టీ ఎంపీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు రమేష్‌ బిధూరీని పార్టీ పక్కనపెట్టింది. మొత్తంగా భాజపా ఇప్పటివరకు 433 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img