ఇబ్బంది పెట్టినా ప్రజల నుంచి వేరుచేయలేరు.. సమయం వచ్చినపుడు అన్నీ చెప్తా: పొంగులేటి

ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు.

Updated : 10 Jan 2023 15:58 IST

మణుగూరు: ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు. తాను ఉగ్రవాదిని కాదని.. దందాలేమీ చేయలేదని వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తన అభిమానులు, అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. 

‘‘నమ్ముకున్న వారి కోసమే నా జీవితం. భద్రతా సిబ్బందిని తొలగించినా ఏమీ బాధపడలేదు. ఇప్పుడున్న ఇద్దరిని తీసేసినా ఏమీ కాదు. నేను రాజకీయాల్లోకి రాకముందే నేను కాంట్రాక్టర్‌ను. కేసీఆర్‌ పిలుపు మేరకు భారాసలో చేరా. గడిచిన నాలుగేళ్లలో పార్టీలో ఏం గౌరవం పొందామో మీకూ తెలుసు. ప్రజల ఆశీస్సులతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. లక్షల మంది అభిమానించే సైనికులు, అభిమానులు ఉన్నారు. ఉమ్మడి  ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల్ని కలుస్తా. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలను వదిలేది లేదు. నన్ను ఇబ్బంది పెట్టినా.. ప్రజల నుంచి వేరుచేయలేరు. సమయం, సందర్భం వచ్చినపుడు అన్ని విషయాలు చెప్తా’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని