Opposition Meet: రెండో రోజు మొదలైన విపక్షాల భేటీ.. హాజరైన శరద్‌ పవార్‌

బెంగళూరు వేదికగా వరుసగా రెండో రోజు విపక్షాల భేటీ ప్రారంభమైంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు.

Updated : 18 Jul 2023 13:18 IST

బెంగళూరు: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించటమే ఏకైక లక్ష్యంగా వరుసగా రెండో రోజు విపక్షాలు సమావేశమయ్యాయి. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ఎండ్‌ హోటల్‌లో మంగళవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయి చర్చలను ప్రారంభించారు.

విపక్ష కూటమి పగ్గాలు.. సోనియా గాంధీకేనా?

కనీస ఉమ్మడి కార్యక్రమ (సీఎంపీ) రూపకల్పనకు ఒక ఉప సంఘాన్ని నియమించడం, కూటమికి సంబంధించిన అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను రూపొందించడం వంటివాటిపై నేడు చర్చించనున్నారు. రాష్ట్రాలవారీగా సీట్ల సర్దుబాటు ఎలా జరగాలి, ఎన్నికల వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు ప్రతిపాదించాలి వంటి అంశాలూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. కూటమికి పేరును కూడా నిర్ణయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక, విపక్షాల ఫ్రంట్‌ అధ్యక్ష బాధ్యతలను కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

విపక్షాల వెంటే శరద్‌ పవార్‌..

పార్టీలో ‘చీలిక’ పరిణామాలతో సోమవారం నాటి విందుకు దూరమైన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేడు విపక్షాల భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్‌, ఇతర విపక్ష నేతలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఎన్సీపీని చీల్చి మహారాష్ట్ర భాజపా కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా చేరిన అజిత్‌ పవార్‌ నిన్న శరద్‌ పవార్‌ను కలిశారు. దీంతో విపక్షాల భేటీకి శరద్‌ రాకపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే శరద్‌ పవార్‌ ప్రతిపక్షాల సమావేశానికి హాజరవుతారని ఎన్సీపీ అధికారికంగా ప్రకటించింది.

రెండో రోజు సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు ఎంలు మమతాబెనర్జీ (పశ్చిమ బెంగాల్‌-టీఎంసీ), నీతీశ్‌ కుమార్‌ (బిహార్‌-జేడీయూ), ఎం.కె.స్టాలిన్‌ (తమిళనాడు-డీఎంకే),అరవింద్‌ కేజ్రీవాల్‌ (దిల్లీ-ఆప్‌), భగవంత్‌ మాన్‌ (పంజాబ్‌-ఆప్‌), హేమంత్‌ సోరెన్‌ (ఝార్ఖండ్‌-ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా), మాజీ ముఖ్యమంత్రులు- అఖిలేశ్‌ యాదవ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), ఉద్ధవ్‌ ఠాక్రే (మహారాష్ట్ర), లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (బిహార్‌), మెహబూబా ముఫ్తీ (జమ్మూ-కశ్మీర్‌), సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఎండీఎంకే నేత వైగో, జయంత్‌ చౌధరి (ఆర్‌ఎల్‌డీ) తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని