
Monkey Fever: కర్ణాటకలో మంకీ జ్వరం కలకలం
షిమోగా జిల్లాలో తొలి కేసు నమోదు
షిమోగా: దేశమంతా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో కర్ణాటకలో మంకీ జ్వరం కేసు నమోదవ్వడం కలకలం రేపుతోంది. షిమోగా జిల్లాకు చెందిన ఓ మహిళ(57)కు ఈ జ్వరం సోకినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాదిలో ఇదే తొలి మంకీ జ్వరం కేసు అని అధికారులు తెలిపారు. జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళకు ఎంతకీ తగ్గకపోవటంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇందులో మంకీ జ్వరం అని తేలింది. ప్రస్తుతం తీర్థహల్లీ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో సాగర్ మండలంలోని అరళగోడు గ్రామంలో మంకీ జ్వరంతో 26 మంది మరణించారు. ఆ తర్వాత ఇలాంటి కేసులు వెలుగులోకి రాలేదు. మంకీ జ్వరం దక్షిణాసియాలోని కోతుల ద్వారా మనుషులకు సోకే వైరల్ జబ్బు. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణాలు సంభవిస్తాయి.