DC: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఫ్రాంచైజీతో జట్టు కట్టిన దిల్లీ క్యాపిటల్స్‌

అమెరికాలోనూ క్రికెట్‌ను విస్తరించడానికి తమవంతు సహకారం అందించడానికి దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నడుంబిగించింది. దీనిలో భాగంగా సత్య నాదెళ్ల భాగస్వామిగా ఉన్న ఫ్రాంచైజీతో జట్టు కట్టింది.

Published : 17 Mar 2023 15:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ విస్తరణ కోసం భారీస్థాయిలో లీగ్‌లు జరుగుతున్నాయి. ఐపీఎల్‌, బిగ్‌బాష్ లీగ్‌, అబుదాబి టీ10 లీగ్‌, దక్షిణాఫ్రికా లీగ్‌.. ఇలా సందడి నెలకొంది. తాజాగా అమెరికాలోనూ క్రికెట్‌ ఖ్యాతిని పెంచేందుకు కొత్తగా టీ20 ఫ్రాంచైజీ లీగ్‌ క్రికెట్ సిద్ధమవుతోంది. మేజర్ లీగ్‌ క్రికెట్ (MLC) పేరిట ఈ ఏడాది జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది.  మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో జట్టు కడుతున్నట్లు ప్రకటించింది. 

టెక్ దిగ్గజం సత్య నాదెళ్లకు (Satya Nadella) భాగస్వామ్యం ఉన్న సియాటెల్‌ ఫ్రాంచైజీతో దిల్లీ క్యాపిటల్స్‌ కలిసి పనిచేయనుంది.  ‘సీయాటెల్‌ ఆర్కాస్‌’ పేరుతో ఎంఎల్‌సీలో ఆడనుంది.  ‘‘దిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్‌ గ్రూప్‌ త్వరలోనే సీయాటెల్ ఆర్కాస్‌తో జట్టు కట్టనుంది. ప్రపంచ స్థాయి క్రికెట్‌ జట్టును తయారు చేసేందుకు అవసరమైన సహకారం అందించనుంది’’ అని MLC ఓ ప్రకటనలో పేర్కొంది. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫ్రాంచైజీలకు కూడా భాగస్వామ్యాలు ఉన్నాయి.  

సుదీర్ఘ అనుభవం ఉండటం వల్లే..

‘‘దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఐపీఎల్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆరుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకొంది. అలాగే 2021 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించింది. పసిఫిక్ నార్త్‌వెస్ట్‌ ప్రాంతంలో క్రికెట్‌ను విస్తరించడానికి ఉత్సాహంగా ఉన్నాం. మా జట్టుకు ఆర్కాస్‌ పేరు పెట్టడం వెనుక కారణం ఉంది. స్థానిక కమ్యూనిటీని ప్రతిబింబించేలా పెట్టడం జరిగింది. క్రీడా స్ఫూర్తిని చాటేందుకు సహాయ పడుతుంది ’’ అని ఆర్కాస్‌ ఇన్వెస్టర్ గ్రూప్ తెలిపింది. ఈ గ్రూప్‌లో సత్య నాదెళ్లతోపాటు మడ్రోనా వెంచర్స్ ఎండీ సోమ సోమసెగర్, ఐసెర్టిస్ సీఈవో సమీర్ బోడాస్, గ్రేట్ పాయింట్‌ వెంచర్స్ మేనేజింగ్‌ పార్టనర్ అశోక్  కృష్ణమూర్తి, మైక్రోసాఫ్ట్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ సంజయ్‌ పార్థసారథి ఉన్నారు. 

ఆర్కాస్‌తో జట్టుకట్టడంపై దిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని కిరణ్‌ కుమార్‌ గ్రంథి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయంగా క్రికెట్‌ వృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశాలు కలిగిన దేశాల్లో అమెరికా ఒకటని మా భావన. సీటల్‌ ఆర్కాస్‌తో కలిసి పని చేయడం వల్ల మెరుగైన ఫలితాలను సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని