సంక్షిప్త వార్తలు (5)

పురుషుల హాకీ ప్రపంచకప్‌కు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చినందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ)కు ఆసియా హాకీ సమాఖ్య నుంచి ‘ఉత్తమ నిర్వహణ’ అవార్డు లభించింది.

Updated : 24 Mar 2023 04:10 IST

హాకీ ఇండియాకు ఉత్తమ నిర్వహణ అవార్డు

దిల్లీ: పురుషుల హాకీ ప్రపంచకప్‌కు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చినందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ)కు ఆసియా హాకీ సమాఖ్య నుంచి ‘ఉత్తమ నిర్వహణ’ అవార్డు లభించింది. కొరియాలో జరిగిన ఆసియా హాకీ సమాఖ్య సమావేశంలో హెచ్‌ఐ ప్రధాన కార్యదర్శి భోళానాథ్‌ సింగ్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భువనేశ్వర్‌, రవూర్కెలా వేదికలుగా ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచకప్‌ జరిగింది. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలు సలీమా టెట్‌ను ఆసియా హాకీ సమాఖ్య అథ్లెట్స్‌ రాయబారిగా నియమించారు. 2021 మహిళల జూనియర్‌ ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టుకు సలీమా కెప్టెన్‌. రాయబారిగా ఆసియా నుంచి    ఎంపికైన నలుగురిలో సలీమా ఒకరు.


భారత జట్లకు ఆసియా ఖోఖో టైటిల్‌

తముల్‌పుర్‌ (అసోం): ఆసియా ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ పురుషులు, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. గురువారం పురుషుల ఫైనల్లో మన జట్టు 33 పాయింట్లు, ఇన్నింగ్స్‌ తేడాతో నేపాల్‌ను ఓడించింది. మహిళల తుది పోరులో బంగ్లాదేశ్‌పై భారత్‌ 49 పాయింట్లు, ఇన్నింగ్స్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది.


బెయిర్‌స్టోకు అనుమతి లేదు

దిల్లీ: ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుంటున్న అతడికి ఐపీఎల్‌లో ఆడేందుకు కావాల్సిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వడానికి ఇంగ్లాండ్‌ బోర్డు (ఈసీబీ) నిరాకరించింది. అతడికి మరింత విశ్రాంతి అవసరమని ఈసీబీ భావించడమే కారణం. నిరుడు సెప్టెంబరులో బెయిర్‌స్టో కాలికి గాయమైంది. మోకాలి, చీలమండ గాయాల నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్‌ లివింగ్‌స్టోన్‌కు ఐపీఎల్‌లో ఆడేందుకు ఈసీబీ అనుమతిచ్చింది. ఆటగాళ్ల వేలంలో లివింగ్‌స్టోన్‌ను రూ.11.50 కోట్లు, బెయిర్‌స్టోను   రూ.6.75 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ కొనుక్కుంది.


హాంకాంగ్‌ లీగ్‌కు ప్రణవి, మమతకు ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: క్రికెట్‌ హాంకాంగ్‌ నిర్వహిస్తున్న ఫెయిర్‌బ్రేక్‌ టీ20 క్రికెట్‌ టోర్నీలో పాల్గొనేందుకు తెలుగమ్మాయిలు ప్రణవి చంద్ర, మమతకు ఆహ్వానాలు అందాయి. ఐసీసీ అనుమతితో ఏప్రిల్‌ 1 నుంచి 16 వరకు హాంకాంగ్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. బీసీసీఐ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తెచ్చుకుని టోర్నీలో బరిలో దిగొచ్చంటూ ప్రణవి, మమతకు పంపిన ఆహ్వానంలో క్రికెట్‌ హాంకాంగ్‌ పేర్కొంది. డాని వ్యాట్‌, సోఫియా డంక్లే, సీవర్‌ బ్రంట్‌ (ఇంగ్లాండ్‌), హేలీ మాథ్యూస్‌, స్టెఫానీ టేలర్‌, డాటిన్‌ (వెస్టిండీస్‌), లారా వోల్వార్డ్‌, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌,  మరిజేనె కాప్‌, అయబొంగ ఖాక (దక్షిణాఫ్రికా) వంటి క్రికెటర్లు హాంకాంగ్‌ టోర్నీలో పాల్గొంటున్నారు.


ఐపీఎల్‌ వస్తోంది.. కానీ

దిల్లీ: ఐపీఎల్‌ సృష్టించే సందడిలో వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవాన్ని మరిచిపోయి తప్పు చేయొద్దని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ టీమ్‌ఇండియాను హెచ్చరించాడు. ‘‘ఐపీఎల్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. కానీ వన్డే సిరీస్‌ ఓటమిని మరిచిపోకూడదు. భారత్‌ కొన్నిసార్లు ఓటముల్ని మరిచిపోయి తప్పు చేస్తుంది. ఈసారి అలా జరగకూడదు. వన్డే ప్రపంచకప్‌లో మరోసారి ఆసీస్‌తో తలపడాల్సి రావొచ్చు. కంగారూల జట్టు ఒత్తిడి పెంచడం వల్ల మూడో వన్డేలో భారత్‌కు ఓటమి ఎదురైంది. 270 లేదా 300 పరుగుల లక్ష్యాలను ఛేదించాలంటే పెద్ద భాగస్వామ్యాలు నిర్మించడం అవసరం. కానీ అది జరగలేదు. బౌండరీలు గగనమయ్యాయి. సింగిల్స్‌ రాబట్టడం కూడా కష్టమైంది. అలా జరుగుతున్నప్పుడు అలవాటు లేని షాట్లు ఆడతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని