సాకర్‌ బాటలో క్రికెట్‌!.. ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌

ఆటగాళ్ల సమయంపై అంతర్జాతీయ క్రికెట్‌ గుత్తాధిపత్యానికి ఐపీఎల్‌్ ముగింపు పలికిందని ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు.

Updated : 05 Jun 2023 03:53 IST

బెకెన్‌హమ్‌: ఆటగాళ్ల సమయంపై అంతర్జాతీయ క్రికెట్‌ గుత్తాధిపత్యానికి ఐపీఎల్‌ ముగింపు పలికిందని ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు. సాకర్‌ బాటలో క్రికెట్‌ సాగుతోందని, భవిష్యత్‌లో ఫ్రాంఛైజీ క్రికెట్‌ కంటే జాతీయ జట్టుకు ఆడేలా ఆటగాళ్లను ఒప్పించడం సవాలుగా మారుతుందన్నాడు. టీ20 లీగ్‌ల కోసం న్యూజిలాండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను బౌల్ట్‌ కాదనుకున్నాడని, దశాబ్దం క్రితం నుంచే ఐపీఎల్‌తో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయని కమిన్స్‌ చెప్పాడు. ‘‘ఆటగాళ్ల సమయంపై ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుత్తాధిపత్యం లేదు. ఓ దశాబ్దం క్రితమే ఐపీఎల్‌ దీన్ని మార్చింది. భవిష్యత్‌లో మరింత ఎక్కువగా లీగ్‌ల ఆధిపత్యం ఉంటుంది. ఆస్ట్రేలియాకు ఆడడాన్ని ప్రత్యేకమైందిగా ఉంచేందుకు ప్రయత్నించాలి. అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ. ప్రతి ఆటగాడు ఆసీస్‌కు ఆడాలనేలా చూసుకోవాలి. కానీ అది సవాలుతో కూడుకున్నది. లీగ్‌ల కారణంగా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్‌ క్యాలెండర్‌ భిన్నంగా ఉంటుందనుకుంటున్నా. క్రికెట్‌ కూడా సాకర్‌ బాటలోనే సాగుతోంది. తమ క్రికెటర్లను జాతీయ జట్టుకు ఆడించేందుకు ఆయా ఫ్రాంఛైజీల నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తుందేమో’’ అని అతను తెలిపాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో తమ తొలి ఫైనల్లో టీమ్‌ఇండియాతో పోరు కోసం ఎదురు చూస్తున్నామని కమిన్స్‌ చెప్పాడు. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌తో తలపడబోతున్నాం. యాషెస్‌ లేదా భారత్‌తో నాలుగైదు టెస్టుల సిరీస్‌ అంటే పెద్ద యుద్ధాలే. కానీ రెండు లేదా మూడు టెస్టుల సిరీస్‌కూ ఈ డబ్ల్యూటీసీ కారణంగా ప్రాధాన్యత పెరిగింది’’ అని కమిన్స్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని