IND v ENG: ఇంగ్లాండ్‌ అదే వ్యూహంతో..

పరిస్థితులు  ఎలా ఉన్నా.. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఎక్కడైనా.. దూకుడు మంత్రంతో, బజ్‌బాల్‌ ఆటతీరుతో ఇంగ్లాండ్‌ సాగిపోతోంది. ఓటములు ఎదురైనా.. విమర్శలు వస్తున్నా.. తగ్గేదేలేదంటోంది.

Updated : 23 Jan 2024 06:45 IST

పరిస్థితులు  ఎలా ఉన్నా.. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఎక్కడైనా.. దూకుడు మంత్రంతో, బజ్‌బాల్‌ ఆటతీరుతో ఇంగ్లాండ్‌ సాగిపోతోంది. ఓటములు ఎదురైనా.. విమర్శలు వస్తున్నా.. తగ్గేదేలేదంటోంది. టెస్టులకు వేగాన్ని జోడించి.. సుదీర్ఘ ఫార్మాట్‌ను సరికొత్తగా మారుస్తోంది. ఇప్పుడా జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. టీమ్‌ఇండియాతో అయిదు టెస్టుల సమరానికి సై అంటోంది. కానీ రోహిత్‌ సేనతో పోరులో భారత్‌లోని స్పిన్‌ పిచ్‌లపై ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ వ్యూహం ఫలిస్తుందా? మన జట్టు ముందు ఇంగ్లిష్‌ ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతుందా?

ఈనాడు క్రీడావిభాగం

భారత్‌, ఇంగ్లాండ్‌ (IND v ENG) మధ్య అయిదు టెస్టుల సిరీస్‌కు సమయం ఆసన్నమవుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో గురువారం తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. భారత్‌లో మరోసారి సిరీస్‌ విజయంపై కన్నేసిన ఇంగ్లాండ్‌ తీవ్ర కసరత్తుల్లో మునిగిపోయింది. సొంతగడ్డపై భారత్‌ టెస్టు సిరీస్‌ ఓడి 11 ఏళ్లు గడిచిపోయాయి. కానీ చివరగా ఓడింది ఇంగ్లాండ్‌ చేతిలోనే కావడం గమనార్హం. 2012లో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. అప్పటి నుంచి సొంతగడ్డపై భారత్‌ మరో టెస్టు సిరీస్‌ ఓడిపోలేదు. ప్రత్యర్థికి సిరీస్‌ డ్రా చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. వరుసగా అన్ని సిరీస్‌లు గెలిచింది. 46 టెస్టుల్లో 36 నెగ్గింది. మూడు మాత్రమే ఓడింది. ఏడు డ్రా చేసుకుంది. 2016లో 4-0తో, 2021లో 3-1తో ఇంగ్లాండ్‌నూ చిత్తుచేసింది. ఇప్పుడు మరోసారి ఇంగ్లాండ్‌తో పోరుకు రంగం సిద్ధమైంది.

విజయం కోసం: భారత్‌లో మరో టెస్టు సిరీస్‌ విజయం కోసం ఇంగ్లాండ్‌ పరితపిస్తోంది. ఇక్కడ 15 టెస్టు సిరీస్‌ (1980లో జరిగిన ఏకైక టెస్టును మినహాయిస్తే)లు ఆడిన ఇంగ్లాండ్‌ నాలుగింట్లో గెలిచింది. మూడు డ్రా చేసుకుంది. 8 సిరీస్‌ల్లో ఓడింది. భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్లు డగ్లస్‌ జార్డిన్‌, టోనీ గ్రెయిగ్‌, డేవిడ్‌ గోవర్‌, కుక్‌ సరసన నిలవాలనే పట్టుదలతో ఇప్పుడు స్టోక్స్‌ ఉన్నాడు. కోచ్‌ మెక్‌కలమ్‌తో కలిసి అతను ఇంగ్లాండ్‌ టెస్టులాడే విధానాన్నే పూర్తిగా మార్చేశాడు. బజ్‌బాల్‌ ఆటతో ఇంగ్లాండ్‌ దూకుడు అందుకుంది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్టోక్స్‌ 18 టెస్టుల్లో 13 విజయాలు అందుకున్నాడు. గత 18 నెలలుగా ఆ జట్టు టెస్టుల్లో సగటున ఓవర్‌కు 4.8 పరుగుల చొప్పున సాధించింది. భారత్‌తో సిరీస్‌ ముంగిట వార్మప్‌ మ్యాచ్‌లు ఆడకుండా.. అబుదాబిలో 11 రోజుల శిక్షణ శిబిరంలో ఆ జట్టు పాల్గొంది. ఇక్కడి స్పిన్‌ పిచ్‌లకు తగ్గట్లుగా సిద్ధమైంది. పైగా నిరుడు పాకిస్థాన్‌లో టెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయడంతో స్పిన్‌ పరిస్థితుల్లో సమర్థంగా ఆడగలమనే ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు అడుగుపెట్టింది.

స్పిన్‌కు సిద్ధమై..: బ్యాటర్లు బెయిర్‌స్టో, క్రాలీ, డకెట్‌, ఫోక్స్‌, లారెన్స్‌, పోప్‌, రూట్‌, స్టోక్స్‌.. పేసర్లు అండర్సన్‌, అట్కిన్సన్‌, రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌.. స్పిన్నర్లు జాక్‌ లీచ్‌, టామ్‌ హార్ట్‌లీ, షోయబ్‌ బషీర్‌, రెహాన్‌ అహ్మద్‌లతో ఇంగ్లాండ్‌ బలంగానే ఉంది. సీనియర్‌ బ్యాటర్‌ రూట్‌కు భారత్‌లో మంచి రికార్డు ఉంది. ఇక్కడ 10 టెస్టుల్లో 50.10 సగటుతో 952 పరుగులు చేశాడు. అతను స్పిన్‌తోనూ జట్టుకు సహాయపడగలడు. ఇక్కడ 8 వికెట్లూ పడగొట్టాడు. ఓవరాల్‌గా భారత్‌పై 30 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో స్టోక్స్‌ 773 పరుగులు చేయడంతో పాటు 39 వికెట్లు పడగొట్టాడు. కానీ మోకాలి శస్త్రచికిత్స తర్వాత అతను ఈ సిరీస్‌లో బౌలింగ్‌ చేయడం కష్టమే. మరోవైపు బ్యాటింగ్‌లో బెయిర్‌స్టో ప్రమాదకరమే. క్రాలీ, డకెట్‌, పోప్‌ కూడా క్రీజులో కుదురుకుంటే పరుగులు సాధించగలరు. బౌలింగ్‌లో అండర్సన్‌, అట్కిన్సన్‌, రాబిన్సన్‌, మార్క్‌వుడ్‌ రూపంలో నాణ్యమైన పేసర్లున్నారు. వయసు మీదపడుతున్నా వన్నె తగ్గని పేస్‌తో అండర్సన్‌ దూసుకెళ్తున్నాడు. భారత్‌లో ఆడిన 13 టెస్టుల్లో అతను 34 వికెట్లు పడగొట్టాడు. 700 టెస్టు వికెట్లకు మరో 10 వికెట్ల దూరంలో ఉన్న 41 ఏళ్ల అండర్సన్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఇక్కడి స్పిన్‌ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి నలుగురు స్పిన్నర్లను ఇంగ్లాండ్‌ ఎంపిక చేసింది. కానీ అనుభవలేమి స్పష్టం. టామ్‌ హార్ట్‌లీ ఇంకా టెస్టు అరంగేట్రం చేయలేదు. 20 ఏళ్ల షోయబ్‌ బషీర్‌ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోనే అడుగుపెట్టలేదు. గాయం నుంచి కోలుకున్న జాక్‌ లీచ్‌ 35 టెస్టులాడగా.. 19 ఏళ్ల రెహాన్‌ అహ్మద్‌ ఆడింది ఒకటే టెస్టు. మరి ఈ స్పిన్‌ దళంతో ఇంగ్లాండ్‌ ఏమేర పోటీనిస్తుందో చూడాలి.


22

స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఆడిన 64 టెస్టుల్లో భారత్‌ విజయాలు. 14 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. 28 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.


ఇప్పటివరకూ భారత్‌లో 15 టెస్టు సిరీస్‌లు ఆడిన ఇంగ్లాండ్‌.. నాలుగు సార్లు (1933-34, 1976-77, 1984-85, 2012) గెలిచింది. మూడు సిరీస్‌ల (1951-52, 1964, 2006)ను డ్రా చేసుకుంది. భారత్‌ 8 సిరీస్‌లు నెగ్గింది. ఇవి కాకుండా 1980లో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లాండ్‌ గెలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని