Ravi shastri: కివీస్‌ పర్యటనలో టాప్‌ ఆర్డర్‌ తడబడింది.. ఒకరు మాత్రం గురి తప్పలేదు: రవిశాస్త్రి

న్యూజిలాండ్‌లో పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌ సుందర్‌ ప్రదర్శన తనను ఆకట్టుకుందంటూ మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు గుప్పించాడు. 

Published : 03 Dec 2022 01:21 IST

దిల్లీ: న్యూజిలాండ్‌ పర్యటన ఫలితం ఎలా ఉన్నా దీని ద్వారా టీమ్‌ఇండియాకు మంచే జరిగిందంటూ మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. దీని ద్వారా యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చిందన్నాడు. ఈ సిరీస్‌ను 1-0తో కివీస్‌ జట్టు గెలిచింది. చివరి రెండు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఉమ్రాన్‌ మాలిక్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి యువ ఆటగాళ్లు ఈ పర్యటనలో తమ ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించారు. 

ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘ఈ వన్డే సిరీస్‌ వల్ల మంచే జరిగింది.  శ్రేయస్‌ రెండు మ్యాచుల్లో అదరగొట్టాడు. క్లిష్ట సమయంలో నిలదొక్కుకోగలిగాడు. సూర్యకుమార్‌ సామర్థ్యం, ప్రతిభ ఉన్న ఆటగాడు కాబట్టి అతడు కచ్చితంగా బాగానే ఆడతాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌తో కట్టిపడేశాడు. దీనిని అతడు నిలుపుకోగలిగితే అద్భుతంగా రాణిస్తాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇన్నింగ్స్‌ ఆరంభంలో శుభ్‌మన్‌ గిల్‌ ఆకట్టుకొన్నాడు. ఈ పర్యటనలో జట్టు ఎదుర్కొన్నవి చాలా క్లిష్టమైన, అరుదైన పరిస్థితులు. ఈ అవకాశం అన్నిసార్లు లభించకపోవచ్చు. అందుకే, ఈ అనుభవం ఆటగాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడి మైదానం, వాతావరణం అన్నింటినీ భవిష్యత్తులో పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గాయం కారణంగా కొంత కాలం జట్టుకు దూరమైన సుందర్‌ ఈ అవకాశాన్ని అద్భుతంగా ఒడిసిపట్టాడు. బ్యాటింగ్‌ పరంగా మంచి పరిణతి చూపాడు. క్లిష్ట సమయంలో టాప్‌ ఆర్డర్‌ సైతం తడబడింది. కానీ, ఇతడు మాత్రం పొందికగా ఆడాడు. కఠినమైన పరిస్థితుల్లో అర్ధశతకం కొట్టడం అంత తేలిక కాదు. ఈ ఇన్నింగ్స్‌ సుందర్‌కి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అని తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని