WTC Final: గిల్‌ ఆ విషయాన్ని దాచిపెట్టడం ఆశ్చర్యం

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌గిల్‌ గాయపడ్డా ఆ విషయాన్ని దాచిపెట్టడం ఆశ్చర్యం కలిగించిందని మాజీ క్రికెటర్‌ సాబా కరిమ్‌ అన్నారు...

Published : 04 Jul 2021 01:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌గిల్‌ గాయపడ్డా.. ఆ విషయాన్ని దాచిపెట్టడం ఆశ్చర్యం కలిగించిందని మాజీ క్రికెటర్‌ సాబా కరిమ్‌ అన్నారు. అలాగే టీమ్‌ఇండియా జట్టులో అనేక మంది ఫిజియోలు, ట్రెయినర్లు ఉన్నా ఒక్కరు కూడా అతడి గాయాన్ని గుర్తించలేకపోయారని చెప్పారు. దాంతో గిల్‌ ఇప్పుడు సుమారు రెండు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సందర్భంగా మాజీ క్రికెటర్‌ యువ క్రికెటర్‌ గాయంపై స్పందించారు.

‘శుభ్‌మన్‌గిల్‌ తన గాయాన్ని దాచిపెట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అతడు చాలా కాలంగా టీమ్‌ఇండియాతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అక్కడ ఫిజియోలు, వైద్య సహాయకులు ఎప్పటికప్పుడు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ పరీక్షిస్తుంటారు. అసలా గాయం ఎప్పుడు జరిగింది. అతడెందుకు దాచిపెట్టాడనే విషయాలు ఆశ్చర్యంగా ఉన్నాయి’ అని కరిమ్‌ పేర్కొన్నారు. అయితే, గతేడాది స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. దాంతో న్యూజిలాండ్‌తో తుదిపోరుకు ముందు గాయపడ్డానని తెలిస్తే జట్టులో నుంచి తొలగిస్తారనే కారణంగా గిల్‌ తన గాయం విషయాన్ని దాచిపెట్టి ఉంటాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని