WI vs IND: టెస్టుల్లో భారత్‌కు ఆ ‘మూడు’ సంగతేంటి?

విండీస్‌పై టెస్టు (WI vs IND) సిరీస్‌ను గెలిచినప్పటికీ.. టీమ్‌ఇండియాలో ఏదో తెలియని వెలితి. క్లీన్‌స్వీప్‌ చేయలేదనే నిరాశతోపాటు మరో మూడు సమస్యలు బహిర్గతమయ్యాయి. అవేంటో చూసేద్దాం..

Updated : 25 Jul 2023 16:59 IST

ఇంటర్నెట్ డెస్క్:  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC 2023-2025) మూడో సీజన్‌లో భాగంగా విండీస్‌తో రెండు టెస్టుల (WI vs IND) సిరీస్‌లో భారత్‌ తలపడింది. బ్యాటర్లు, బౌలర్లు సమష్ఠిగా రాణించి 1-0 ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. రెండో టెస్టు వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నా.. వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ మూడు సమస్యలు భారత్‌ ఎదుర్కోవడం గమనార్హం. మరి అవేంటో ఓసారి చూద్దాం.. 

ఆ స్థానంలో కుదురుకోవాలి..

డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో సీనియర్‌ ఆటగాడు ఛెతేశ్వర్‌ పుజారా (Pujara) విఫలమయ్యాడు. అంతకు ముందు కౌంటీల్లో వరుసగా సెంచరీలు బాదడంతో అతడిపై భారీ అంచనాలు ఉండేవి. తీరా, కీలకమైన పోరులో చేతులెత్తేయడంతో పుజారాను పక్కన పెట్టేశారు. విండీస్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. యవకులు ఇషాన్ కిషన్‌, యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కింది. ఓపెనర్‌గా వచ్చిన యశస్వి తొలి టెస్టులోనే భారీ శతకంతో ఎంట్రీ అదరగొట్టాడు. ఇక ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) కూడా రెండో టెస్టులో ముందుకొచ్చి మరీ వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు.

టీమ్‌ఇండియా ‘డబ్ల్యూటీసీ’ పాయింట్లపైనా వరుణుడి దెబ్బ!

అయితే, ఏ జట్టుకైనా వన్‌డౌన్‌ చాలా కీలకం. ఇలాంటి స్థానంలో ఎవరు ఆడతారు? అనే ప్రశ్న తలెత్తింది. సీనియర్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) నాలుగో స్థానంలో వస్తాడు. దీంతో శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) స్వయంగా ముందుకొచ్చి.. తాను ఆడాలని భావిస్తున్నట్లు మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లాడు. అందరూ అద్భుతమని కొనియాడారు. ఎందుకంటే ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాడు క్రీజ్‌లో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంటుంది. అయితే, ఓపెనర్లు అదరగొట్టిన రెండు టెస్టుల్లోనూ గిల్ మాత్రం నిరాశపరిచాడు. ఇక్కడ ఉండే ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమయ్యాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. తొలి టెస్టులో 6 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో టెస్టులో 10, 29* పరుగులు సాధించాడు. రెండో టెస్టు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కాస్త దూకుడు ప్రదర్శించాడు. ఇలాంటి కీలక స్థానంలో ఉత్తమ ప్రదర్శన చేయాలంటే మరింత అనుభవం అవసరం. మరికొన్ని మ్యాచ్‌ల్లో గిల్‌కు అవకాశం ఇవ్వాలనే సూచనలు వచ్చాయి.

వైస్‌ కెప్టెన్‌కు ఏమైంది?

ఐపీఎల్‌లో సూపర్ ప్రదర్శన.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో నిలకడైన ఆటతీరు.. ఇదీ విండీస్‌ పర్యటనకు ముందు అజింక్య రహానె (Ajikya Rahane) పరిస్థితి. టీమ్‌ఇండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గానూ బాధ్యతలు చేపట్టాడు. తీరా, ఇతర బ్యాటర్లు అలవోకగా పరుగులు సాధించిన పిచ్‌లపై తేలిపోవడం విస్మయానికి గురి చేస్తోంది. రెండు టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. అయితే, మొత్తం 11 పరుగులు (3, 8) మాత్రమే చేయడం గమనార్హం. డిసెంబర్‌ వరకు టెస్టు మ్యాచ్‌లు లేవు. మళ్లీ దక్షిణాఫ్రికాతోనే సిరీస్‌ ఆడాల్సి ఉంటుంది. ఆలోగా దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తేనే జట్టులో చోటు దక్కుతుంది.

జయ్‌దేవ్‌.. ఇలాగైతే కష్టమే

చాలా రోజుల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన జయ్‌దేవ్‌ ఉనద్కత్ (Jaydev) ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. రెండు టెస్టుల సిరీస్‌లో భారత బౌలర్లు 230 ఓవర్లు వేశారు. అందులో జయ్‌దేవ్‌ వేసిన ఓవర్లు కేవలం 28 మాత్రమే అంటే మీరు నమ్ముతారా..? ఈ సిరీస్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అడుగు పెట్టిన ముకేశ్‌ కుమార్‌ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లు వేసిన ముకేశ్‌ నాలుగు మెయిడిన్లు చేయడం విశేషం. ఈ క్రమంలో జయ్‌దేవ్‌ ఇలాగే కొనసాగితే జట్టులో చోటు సంపాదించడం కష్టమే అవుతుంది. యువ క్రికెటర్ల నుంచి విపరీతమైన పోటీ ఎదుర్కోక తప్పదు. 

గురువారం నుంచి విండీస్ - భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ టోర్నీల ముందు టీమ్‌ఇండియా ఆడే చివరి సిరీస్‌ కూడా ఇదే అవ్వొచ్చు. అన్ని విభాగాలను పరీక్షించడానికి మంచి అవకాశంగా వినియోగించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని