IND vs SL: వన్డే క్రికెట్‌ చరిత్రలో టీమ్ఇండియా సరికొత్త రికార్డు..

మూడో వన్డేలో శ్రీలంకపై 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకున్న టీమ్‌ఇండియా (Team India) వన్డేల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. 

Published : 16 Jan 2023 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా (Team India) వన్డే క్రికెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్‌ అవతరించింది. ఐర్లాండ్‌పై 290 పరుగుల తేడాతో (2008లో) న్యూజిలాండ్‌ పేరిట ఉన్న రికార్డును భారత్‌ అధిగమించింది.  

2015లో అఫ్గానిస్థాన్‌పై 275 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా (272.. జింబాబ్వేపై, 2010), సౌతాఫ్రికా (258.. శ్రీలంకపై,2012), భారత్‌ (257.. బెర్ముడాపై, 2007), దక్షిణాఫ్రికా (257.. వెస్టిండీస్‌పై, 2015), ఆస్ట్రేలియా (256.. నమీబియాపై, 2003), భారత్ (256.. హంకాంగ్‌పై, 2008), పాకిస్థాన్‌ (255.. ఐర్లాండ్‌పై, 2016) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

వన్డేల్లో వికెట్ల పరంగా భారీ విజయాల్లోనూ టీమ్‌ఇండియానే అగ్రస్థానంలో ఉంది. 1975లో ఈస్ట్ ఆఫ్రికాపై భారత్‌ 181 బంతులు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఈస్ట్‌ ఆఫ్రికా 120 పరుగులకే కుప్పకూలగా.. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్.. వికెట్ నష్టపోకుండా 29.5 ఓవర్లలో ఛేదించింది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మ్యాచ్‌ జరిగినప్పుడు వన్డేల్లో 60 ఓవర్లుండేవి. 1981లో టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్‌ 30 బంతులు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో విజయం సాధించిఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని