Faf duplessis: సుదీర్ఘ టోర్నీతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందే: డుప్లెసిస్

లీగ్‌ స్టేజ్‌లో టాప్‌-2లో చోటు దక్కించుకోకుంటే ఫైనల్‌ చేరడం చాలా కష్టమని బెంగళూరు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఈసారి మెగా టోర్నీ రెండు నెలలకుపైగా పొడిగించడం...

Published : 27 May 2022 15:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లీగ్‌ స్టేజ్‌లో టాప్‌-2లో చోటు దక్కించుకోకుంటే ఫైనల్‌ చేరడం చాలా కష్టమని బెంగళూరు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఈసారి మెగా టోర్నీ రెండు నెలలకుపైగా సాగడంతో అటు శారీరకంగా ఇటు మానసికంగా ఇబ్బందేనని తెలిపాడు. అయితే, ఇంత సుదీర్ఘ టోర్నీ ఆడటం వల్ల చివరి దశకు చేరుకునేసరికి పరిస్థితులకు అలవాటు పడ్డామని చెప్పాడు. అలాగే లఖ్‌నవూతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌ తేలికపాటి జల్లుల వల్ల ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆరోజు రాత్రి తమ ఆటగాళ్లలో చాలా మందికి తగినంత నిద్రలేకపోయిందని పేర్కొన్నాడు.

బెంగళూరు ఈరోజు రాజస్థాన్‌తో క్వాలిఫయర్‌-2 పోటీలో తలపడుతున్న సందర్భంగా డుప్లెసిస్‌ ఓ వీడియోలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే లీగ్‌ స్టేజ్‌లో వాంఖడే వేదికగా ముంబయి, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసి సెలబ్రేట్‌ చేసుకోవడంపై స్పందిస్తూ.. ‘అది మేం కచ్చితంగా ఆస్వాదించాల్సిన విషయం. ఎందుకంటే ఆ రోజు మేం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే విషయం మా చేతుల్లో ఏమీ లేదు. ముంబయి గెలవడంతో మాకు అవకాశం వచ్చింది. అప్పుడు మేమంతా తీవ్ర భావోద్వేగంలో ఉన్నాం. అందుకే సెలబ్రేట్‌ చేసుకున్నాం’ అని డుప్లెసిస్‌ చెప్పుకొచ్చాడు. కాగా, అనూహ్య రీతిలో ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూను ఓడించింది. ఈరోజు రాజస్థాన్‌తో పోటీపడనుంది. ఇక్కడ కూడా విజయం సాధిస్తే ఫైనల్లో గుజరాత్‌తో తలపడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు ఏం చేస్తుందో వేచి చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని