వెయ్యి కిలోమీటర్ల వరకూ

కార్చిచ్చులు అటవీ ప్రాణులకే కాదు, మనుషుల ప్రాణాలకూ ముప్పు తెచ్చి పెడుతున్నాయి. వీటితో రేగే పొగ మూలంగా 2000-2016 మధ్యకాలంలో ఏటా 33వేలకు పైగా మంది మరణించారు. లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌లో ప్రచురితమైన ...

Updated : 29 Sep 2021 06:09 IST

కార్చిచ్చులు అటవీ ప్రాణులకే కాదు, మనుషుల ప్రాణాలకూ ముప్పు తెచ్చి పెడుతున్నాయి. వీటితో రేగే పొగ మూలంగా 2000-2016 మధ్యకాలంలో ఏటా 33వేలకు పైగా మంది మరణించారు. లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంటున్న విషయమిది. మొత్తం 43 దేశాల్లోని 749 పట్టణాల్లో అన్నిరకాల కారణాలతో సంభవించిన మరణాలను విశ్లేషించి మరీ దీన్ని గుర్తించారు. కార్చిచ్చు కాలుష్య సంబంధ మరణాలపై తొలి ప్రపంచవ్యాప్త అధ్యయనం ఇదే. ఇటీవల కార్చిచ్చుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో దీని ఫలితాలు ఇంకాస్త ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేవలం జులై, ఆగస్టు నెలల్లో సంభవించిన కార్చిచ్చులతో ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ వాతావరణంలో కలిసింది మరి. ఇది మనదేశం నుంచి ఏటా విడుదలయ్యే ఉద్గారాలతో దాదాపు సమానం. కార్చిచ్చు పొగ వెయ్యి కిలోమీటర్ల దూరం వరకూ వ్యాపించగలదు. ఇందులోని నుసి పదార్థం (పీఎం 2.5) చాలా హానికరం. ఇది సూక్ష్మంగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల్లోకి తేలికగా చేరుకుంటుంది. అక్కడ్నుంచి గాలి గదుల్లోకి, రక్తంలోకి కూడా ఇట్టే ప్రవేశిస్తుంది. ఇది శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. కార్చిచ్చు పొగకు కొద్దికాలం గురైనా కొవిడ్‌-19 కేసులు, మరణాలు పెరిగినట్టు ఇటీవలి అమెరికాలో అధ్యయనం ఒకటి చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని