AP News: ఏపీలో ఇక 26 జిల్లాలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్లను ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి విడుదల చేయడం ప్రారంభించింది.

Published : 26 Jan 2022 05:35 IST

ఆన్‌లైన్‌లో మంత్రివర్గం ఆమోదం
బాలాజీ, అల్లూరి, అన్నమయ్య, ఎన్టీఆర్‌, సత్యసాయి పేర్లతోనూ జిల్లాలు
నోటిఫికేషన్ల విడుదల ఆరంభం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్లను ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి విడుదల చేయడం ప్రారంభించింది. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో... దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అంతకుముందు  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు.

కొన్నింటికి పాతపేర్లే

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా... ఇప్పుడున్న జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాత పేర్లనే ఉంచారు. మిగతా జిల్లాల్లో కొన్నిటిని వాటి జిల్లా కేంద్రాల పేర్లతో ఏర్పాటు చేయగా, కొన్నిటికి శ్రీ బాలాజీ, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్‌, సత్యసాయిబాబాల పేర్లు పెట్టారు.

* విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా ‘మన్యం జిల్లా’ని ఏర్పాటు చేశారు. విశాఖలోని పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకి ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లాగా నామకరణం చేశారు. తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాని, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లాని, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాని, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ జన్మించిన నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చినప్పటికీ, విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఆయన పేరు పెట్టారు.

* అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఆయా ప్రాంతాలవ్యావహారిక నామాలతో ఏర్పాటు చేశారు.

* ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలూ కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధన పెట్టుకోలేదు. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం, కొత్తగా ఏర్పడే పక్క జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉంటే, దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. ఉదాహరణకు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని సంతనూతలపాడు శాసనసభ స్థానం ఒంగోలు నగరానికి సమీపంలో ఉంటుంది. కాబట్టి సంతనూతలపాడుని కొత్తగా ఏర్పాటయ్యే బాపట్ల జిల్లాకు బదులు, ఒంగోలు జిల్లాలో చేర్చారు. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని చోట్ల జరిగాయి. కర్నూలుకు ఆనుకుని ఉండే పాణ్యం నియోజకవర్గాన్ని నంద్యాల నుంచి మినహాయించి కర్నూలు జిల్లాలో కలిపారు.

* చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గం తిరుపతికి ఆనుకుని ఉంటుంది. దాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీ బాలాజీ జిల్లాలోకి తెచ్చారు.  

* మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయవాడ నగరంలో భాగంగా ఉంటాయి. వాటిని మాత్రం విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పాటైనఎన్టీఆర్‌ జిల్లాలోకి తేకుండా, మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలోనే ఉంచేశారు.

* హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని రాప్తాడు నియోజకవర్గం అనంతపురం పక్కనే ఉంటుంది. జిల్లాల పునర్విభజనలో దాన్ని అనంతపురం జిల్లా పరిధిలోకి తెచ్చారు.

* కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్తగా 15 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేశారు. దీనితో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 62కి చేరింది. ఎక్కడా కొత్త మండలాల్ని ఏర్పాటు చేయలేదు.

* జనాభా పరంగా (2011 జనాభా లెక్కలు) 23.66 లక్షల మందితో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9.54 లక్షల అతి తక్కువ జనాభా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని