ఉద్యోగుల పరస్పర బదిలీలకు సరే

రాష్ట్రంలో ఉద్యోగుల పరస్పర బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. భార్యాభర్తలను ఒకే చోటుకు బదిలీ చేసేందుకు వచ్చిన వినతులు,

Published : 20 Jan 2022 05:30 IST

సీఎం కేసీఆర్‌ అంగీకారం.. నేడు ఉత్తర్వుల జారీ
అప్పీళ్లు, దంపతుల వినతులను పరిష్కరించాలని ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగుల పరస్పర బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. భార్యాభర్తలను ఒకే చోటుకు బదిలీ చేసేందుకు వచ్చిన వినతులు, బదలాయింపుల సందర్భంగా ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యంతరాలనూ వెంటనే పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్‌ విధానం కింద దాదాపు 70 వేల మందికి పైగా ఉద్యోగుల బదలాయింపు జరిగింది. ఈ సందర్భంగా పలువురు భార్యాభర్తలైన ఉద్యోగులు బదిలీలను కోరారు. పనిచేస్తున్నచోటు కాకుండా వేరే జిల్లాలు, జోన్లు, బహుళజోన్లకు వెళ్లిన ఉద్యోగులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ప్రభుత్వం వీరికి అప్పీళ్లకు అవకాశం కల్పించడంతో దాదాపు మూడువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో సరైనవని భావించిన వాటినే అధికారులు పరిష్కరించగా... మిగిలినవి ఆమోదం పొందలేదు.

భార్యాభర్తల బదిలీలకు సంబంధించి కొన్ని జిల్లాలకే అనుమతించారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, తదితర జిల్లాల్లో పట్టణ, నగర ప్రాంతాల్లోని పోస్టులకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో టీఎన్జీవోల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, రాయకంటి ప్రతాప్‌, టీజీవో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణలు బుధవారం సచివాలయంలో సీఎస్‌ సోమేశ్‌ను కలిసి పరస్పర బదిలీలు వెంటనే చేపట్టాలని, ఒకేచోటుకు దంపతుల బదిలీలకు అనుమతించాలని, బదలాయింపులపై వచ్చిన అప్పీళ్లను పరిష్కరించాలని అభ్యర్థించారు. సంఘాల వినతులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి వెంటనే పరస్పర బదిలీలకు అనుమతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని