TS News: రైతుబంధుకు రూ.7,600 కోట్లు.. రైతులఖాతాల్లో రేపటి నుంచి జమ

‘రైతుబంధు’ పథకం నిధుల జమకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 28(రేపటి) నుంచి రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ,

Updated : 27 Dec 2021 07:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘రైతుబంధు’ పథకం నిధుల జమకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 28(రేపటి) నుంచి రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ, ఆర్థికశాఖలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌లో మొత్తం రూ.7,600 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని ప్రాథమిక అంచనా. గత జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ వానాకాలంలో మొత్తం కోటిన్నర ఎకరాలకు చెందిన 63.25 లక్షల కమతాలకు రూ.7,508.78 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. గత జూన్‌ నుంచి ఈ నెల 10 వరకూ భూముల క్రయవిక్రయాలతో రెవెన్యూ రికార్డుల్లో నమోదైన రైతుల పేర్లను ఈ నెల 31లోగా నమోదు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో)ను వ్యవసాయశాఖ ఆదేశించింది. కొత్తగా భూములను కొన్న రైతులు ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూఖాతా వివరాలను తెచ్చి ఇస్తే రైతుబంధు పోర్టల్‌లో వివరాలను ఏఈవోలు నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత జూన్‌ నుంచి ఈ నెల 10 వరకూ కొత్తగా 20 వేల మంది భూములు కొన్నట్లు అంచనా. వారి వివరాలను ఏఈవోలు నమోదు చేస్తేనే రైతుబంధు సొమ్ము వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

ఎకరం నుంచి ప్రారంభం...

ఈ నెల 28 నుంచి తొలుత ఎకరా భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము వేస్తారు. రెండో రోజున ఎకరా నుంచి 2, మూడో రోజున 2 నుంచి 3 ఎకరాలు...ఇలా రోజూ ఎకరా విస్తీర్ణం చొప్పున పెంచుతూ సొమ్ము జమచేస్తారు. ఒక్కో ఎకరా పెంచేకొద్దీ ఎందరు రైతులున్నారు, వారి బ్యాంకు ఖాతాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, రెవెన్యూ ఖాతాల వివరాలను ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తనిఖీ చేస్తున్నారు. సొమ్ము జమచేశాక వ్యవసాయశాఖ నుంచి రైతు సెల్‌ నంబరుకు సంక్షిప్త సందేశం వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని