Yadadri Power Plant: యాదాద్రి వెలిగేదెప్పుడో!

రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేకుండా చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. మొదటి దశ కింద

Updated : 13 May 2022 05:48 IST

నత్తనడకన విద్యుత్కేంద్రం పనులు

గతేడాది అక్టోబరుకే పూర్తి కావాలన్నది లక్ష్యం

ఇప్పటికి 54 శాతమే నిర్మాణం

ఆలస్యం కారణంగా రూ.18 వేల కోట్ల అదనపు భారం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేకుండా చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. మొదటి దశ కింద రెండు ప్లాంట్లలో 2020 అక్టోబరుకల్లా ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉండగా.. ఆ గడువు ముగిసి ఏడాదిన్నర దాటినా ఒక్క ప్లాంటూ అందుబాటులోకి రాలేదు. వచ్చే జూన్‌ నాటికి తొలి దశ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. మొత్తం విద్యుత్కేంద్రం అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్లకుపైనే పడుతుందని భావిస్తున్నారు. ఈ జాప్యం ఖరీదు వివిధ రూపాల్లో రూ.18 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం ఈ వేసవిలో రోజుకు గరిష్ఠంగా 283 మిలియన్‌ యూనిట్ల(మి.యూ.)కు చేరింది. దీంతో రోజువారీగా 40- 50 ఎంయూలను డిస్కంలు అధిక ధరలకు కొంటున్నాయి. ఇందుకోసం మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే రూ.2,500 కోట్లు చెల్లించాయి. గడువు ప్రకారం యాదాద్రి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమై ఉంటే.. డిస్కంలకు గత రెండు నెలల్లోనే రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదా అయ్యేవని తెలిసింది. నిర్మాణంలో మూడేళ్లకు పైగా జాప్యంతో.. ఈ కాలంలో కొనుగోలు చేసే కరెంటుపై మొత్తం రూ.13 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. అప్పులపై అదనపు వడ్డీ, నిర్మాణ వ్యయం మరో రూ.5 వేల కోట్లు ఉంటుందని, ఇవన్నీ కలిపితే జాప్యం వల్ల నష్టం రూ.18 వేల కోట్లకు చేరుతుందని అంచనా.

కూలీలు లేక పనులు ఆలస్యం: భెల్‌
విద్యుత్కేంద్రం నిర్మాణం త్వరగా పూర్తికావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవకుండానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భెల్‌కు కాంట్రాక్టు అప్పగించింది. అయితే కరోనా విపత్తు కారణంగా ఇతర రాష్ట్రాల కూలీలు వెనక్కి వెళ్లడంతో పనులు ఆలస్యమైనట్లు భెల్‌ వివరణ ఇచ్చింది. నిర్మాణం వేగంగా జరగాలంటే రోజుకు 13 వేల నుంచి 15 వేల మంది కూలీలు పనిచేయాలి. ప్రస్తుతం బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో కలిపి 6,500 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా మరో 6-7 వేల మందిని రప్పించి పనులు వేగిరం చేస్తామని భెల్‌ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. సబ్‌ కాంట్రాక్టు పనుల టెండర్లలో జాప్యం, ఉప గుత్తేదారులు పనులు వేగంగా చేయకపోవడం వంటి కారణాలతోనూ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.


అదనపు వడ్డీ భారమే రూ.4 వేల కోట్లు

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30 వేల కోట్లు కాగా.. నిర్మాణానికి రూ.22 వేల కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారు. అప్పులపై ‘నిర్మాణ సమయంలో పడే వడ్డీ’(ఐడీసీ).. పనుల్లో మూడేళ్ల జాప్యం కారణంగా దాదాపు రూ.4 వేల కోట్లు అదనంగా ఉండవచ్చని అంచనా. అలానే మొత్తం వ్యయం ఒక మెగావాట్‌కు రూ.9 కోట్లు దాటవచ్చని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే జరిగితే ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంటు యూనిట్‌ ధర రూ.6 నుంచి 7కు చేరుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్కేంద్రాల నుంచి కొంటున్న కరెంటు యూనిట్‌ సగటు వ్యయం రూ.5.30 మాత్రమే కావడం గమనార్హం.


భెల్‌ భరించాల్సిందే: జెన్‌కో సీఎండీ

పనుల్లో తీవ్ర జాప్యంతో భారీగా ఆర్థికభారం పడుతోందని రాష్ట్ర జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ‘ఈనాడు’కు చెప్పారు. నిర్మాణ పనులిలాగే ఆలస్యమైతే భెల్‌ సీఎండీని సీఎం కేసీఆర్‌ పిలిపించే అవకాశాలున్నాయని ఆ సంస్థ ఉన్నతాధికారులను ఆయన హెచ్చరించారు. రూ.వేల కోట్ల అప్పులు తెచ్చి సకాలంలో చెల్లిస్తున్నా పనులు నత్తనడకన సాగడానికి సంస్థ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. అదనంగా పెరుగుతున్న నిర్మాణ వ్యయాన్ని భెల్‌ భరించాల్సిందేనని స్పష్టం చేశారు. 


విద్యుత్కేంద్రం ముఖచిత్రం 

ఎక్కడ నిర్మిస్తున్నారు: నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో 

విద్యుదుత్పత్తి సామర్థ్యం: 4 వేల మెగావాట్లు 

నిర్మించాల్సిన ప్లాంట్లు:

ఒక్కో ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం: 800 మెగావాట్లు 

ఇప్పటివరకూ తెచ్చిన అప్పులు: రూ.22 వేల కోట్లు 

నిర్మాణ ప్రారంభం: 17 అక్టోబరు 2017 

మొదటి 2 ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభ గడువు: 17 అక్టోబరు 2020 

అన్ని ప్లాంట్లలో ఉత్పత్తికి గడువు: 17 అక్టోబరు 2021 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని